చండ్రుగొండ, ఏప్రిల్ 23: నకిలీ మక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు (కాంగ్రెస్ పార్టీకి చెందినవారే) ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది. చండ్రుగొండ మండలం పోకలగూడెం పంచాయతీకి చెందిన 12 మంది గిరిజన రైతులు ఓ కంపెనీకి చెందిన మక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి యాసంగి పంట సాగు చేశారు. దిగుబడి సరిగా రాకపోవడంతో సదరు కంపెనీపై ఫిబ్రవరిలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కంపెనీపై చర్యలు తీసుకోకపోగా.. తమను పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పించుకోవడంతో విసుగు చెందిన రైతులు బుధవారం మండల పర్యటనకు వచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాన్వాయ్ను అడ్డగించి జాతీయ రహదారిపై బైఠాయించారు.
అప్రమత్తమైన పోలీసులు, కాంగ్రెస్ నాయకులు రైతులను పక్కకు నెట్టే ప్రయత్నం చేయగా వాగ్వాదం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ నాయకుడు కిరణ్రెడ్డి వారించడంతో అతడిపై రైతులు తిరగబడ్డారు. దీంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు రైతులను బలవంతంగా పక్కకు నెట్టేశారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే కారు దిగకపోవడంపై రైతులు మండిపడ్డారు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన రైతులే ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకోవడం గమనార్హం.