నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 21: ‘ఉచిత కరెంట్ వద్దన్న కాంగ్రెస్ మాకొద్దు’ అంటూ రైతాంగం తేల్చిచెప్పింది. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ముక్తకంఠంతో తీర్మానాలు ఆమోదించింది. 24 గంటల కరెంట్ ఇస్తూ రైతాంగాన్ని ఆదుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్కు అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఉచిత కరెంట్పై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఐదోరోజూ పలు జిల్లాలో రైతు సమావేశాలు నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ రైతు వేదికలో శుక్రవారం రైతు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై రేవంత్రెడ్డి వ్యాఖ్యలను రైతులకు వినిపించారు. ఇల్లందకుంట మండలం బుజూనూర్ రైతు వేదికలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి నేతృత్వంలో రైతులు కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట, ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పాల్గొని ఉచిత కరెంట్పై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పాల్గొని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండించారు.