హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీఎం కేసీఆర్ ‘కిసాన్ మార్షల్’ అని మహారాష్ట్ర రైతు నాయకుడు, షేత్కరీ యువ సంఘటన నేత సుధీర్ సుధాకర్రావ్ బిందు అభివర్ణించారు. తెలంగాణభవన్లో శనివారం ఆయన బీఆర్ఎస్లో చేరగా, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్ సుధాకర్రావ్ బిందు మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శరద్జోషి నేతృత్వంలో తాము రైతాంగ సమస్యలపై పోరాటం చేశామని, ఇప్పటికీ తమ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని, ఇది అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ మాడల్ బాగుందని కితాబిచ్చారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేస్తున్న తీరు చూస్తుంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా మిలిటరీలో పనిచేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన జార్జ్ సీ మార్షల్ గుర్తుకువస్తున్నారని తెలిపారు. రైతులను సంఘటితం చేసి, నిలదొక్కుకొనేలా చేసేందుకు కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం మార్షల్ ప్లాన్వంటిదేనని, అందు కే ‘కేసీఆర్ కిసాన్ మార్షల్’ అని పేర్కొన్నారు.
రైతుల కోసం బీఆర్ఎస్ ఏర్పడడం, మహారాష్ట్రలోకి ఈ పార్టీ అడుగుపెట్టడం తమ అదృష్టమని అన్నారు. తెలంగాణ పథకాల గురించి తాము విన్నామని, తాము నాందేడ్ నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ఇక్కడ పుష్కలంగా ఉన్న నీళ్లు, పచ్చని పంటలు పరిశీలించామని తెలిపారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా గురించి అడిగి తెలుసుకొన్నామని చెప్పారు. తెలంగాణ తరహా పథకాలు దేశంలోని ప్రతీ రైతుకు అందాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. దేశంలో రైతు నాయకులు అనేక మంది ఉన్నప్పటికీ రాజకీయంగా రైతు సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని, రైతులకు పాలన హక్కు ఉండాలని చెప్పినవారు లేరని అన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని నిజం చేసినప్పుడే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.
రైతు రాజ్యం రావాలి: మాణిక్ కదం
మహారాష్ట్రలో ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యల వార్తలే వింటున్నామని, ఈ దుస్థితి పోవాలంటే రైతు రాజ్యం రావాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. దేశమంతటా తెలంగాణ మాడల్ అమలుకావాలని ఆకాంక్షించారు. రైతుల వెంట కేసీఆర్ ఉంటారనే భరోసాతోనే తాము కార్యక్షేత్రంలోకి దిగుతున్నట్టు చెప్పారు. రాబోయేది కిసాన్ సర్కారే అని ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేతలు, రైతులు బీఆర్ఎస్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.