(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో రైతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. మునుపటి బీజేపీ ‘40 శాతం కమీషన్ సర్కారు’తో విసిగివేసారి కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. కరెంట్ కోతలతో రాష్ర్టాన్ని హస్తం పార్టీ అంధకారంలోకి నెట్టింది. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇస్తామన్న ఐదు గంటల విద్యుత్తును కూడా ప్రభుత్వం సరఫరా చేయట్లేదని, గంటసేపైనా కరెంటు ఉండట్లేదని అన్నదాతలు వాపోతున్నారు.
విద్యుత్తు కోతలను నిరసిస్తూ కర్ణాటక ఫార్మర్స్ అసోసియేషన్ (కేఎఫ్ఏ) ఆధ్వర్యంలో మంగళవారం దసరా నాడు మైసూరులోని బెంగళూరు-మైసూరు హైవేను రైతన్నలు దిగ్బంధించేందుకు యత్నించారు. అయితే కరెంట్ అడిగిన పాపానికి వీరిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసింది. కేఎఫ్ఏ అధ్యక్షుడు కురుబూర్ శాంతకుమార్ సహా పలువురు రైతు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శాంతకుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్పాలనలో రైతుల దసరా కనిపించడం లేదని, మంత్రుల దసరా కనిపిస్తున్నదన్నారు. అన్నదాతల గోసను పట్టించుకోకుండా కాంగ్రెస్ మంత్రులు సంబురాల్లో మునిగితేలుతున్నారని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక, నియంతృత్వ కాంగ్రెస్ సర్కారుకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
వ్యవసాయానికి 5 గంటలు విద్యుత్తు ఇస్తామని విద్యుత్తు శాఖ మంత్రి ఇటీవలే ఆర్భాటంగా ప్రకటించారని, అయితే దానికీ ప్రభుత్వం కట్టుబడలేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గంటసేపైనా కరెంటు ఉండట్లేదని వాపోతున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా ఎన్డీటీవీ చేసిన ఫీల్డ్ స్టడీలో వెల్లడైంది. కిందటేడాది ఆగస్టులో 8,000 మెగావాట్ల నుంచి 8,500 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నెలకొనగా, ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్లో అది 15,000 మెగావాట్ల నుంచి 16,000 మెగావాట్లకు చేరుకొన్నది. రాష్ట్రంలో రోజూవారీ విద్యుత్తు కొరత 1,500 మెగావాట్ల నుంచి 2,000 మెగావాట్ల వరకు ఏర్పడుతున్నది. లోటు వర్షపాతం, బొగ్గు నిల్వలు అడుగంటిపోవడమే దీనికి కారణమని ప్రభుత్వం చెబుతుండగా, సర్కారు ఉదాసీన వైఖరి ఈ దుస్థితికి కారణమని రైతులు మండిపడుతున్నారు.
విద్యుత్తు కోతలకు నిరసనగా కర్ణాటకవ్యాప్తంగా రైతన్నలు నిరసనలు చేపడుతున్నారు. మొన్నటిమొన్న విజయపుర జిల్లా కొల్హారా తాలూకాలోని రోణిహల్ గ్రామ రైతులు.. హుబ్లీ ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ కార్యాలయానికి ఓ ట్రాక్టర్లో మొసలిని తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఐదు గంటలు కరెంటిస్తామని, ఒకట్రెండు గంటలే ఇస్తున్నారని, అది కూడా రాత్రిపూట ఇస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, గుల్బర్గా జిల్లాలో రైతన్నలు పురుగుల మందుల డబ్బాలతో విద్యుత్తు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని, లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
ఐదు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ సర్కారు హామీఇచ్చింది. అయితే, గంటపాటైనా విద్యుత్తు సరఫరా జరుగట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేమెలా పంటలు పండించాలి?
– నారాయణస్వామి, కోలార్ రైతు