తెలంగాణ మాడల్!
ఇదీ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. జాతీయ స్థాయి రాజకీయ నాయకుల్లో ఏ ఇద్దరు కలిసినా మొదటి చర్చనీయాంశం తెలంగాణ మాడల్పైనే! అప్పులపాలై, అష్టకష్టాల్లో ఉన్న వ్యవసాయాన్ని లాభాల్లోకి మళ్లించడం మొదలుకుని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలపడం దాకా, ఎనిమిదేండ్లలో సాధించిన మైలురాళ్లే ఇప్పుడు చర్చనీయాంశం.
కేంద్ర మాజీ మంత్రి, ఆర్థికవేత్త సుబ్రమణ్య స్వామి, రైతు ఉద్యమకారుడు, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమైనప్పుడు కూడా ‘తెలంగాణ మాడల్’పైనే ప్రధానంగా చర్చ జరిగింది. అనతి కాలంలోనే ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించిన తెలంగాణ నమూనా దేశానికే ఆదర్శమనే ప్రశంసలు వినిపించాయి.
హైదరాబాద్, మార్చి 3: కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. సీనియర్ రాజకీయవేత్త, ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చలు జరిపారు. రైతు నేత, ఉద్యమకారుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేఎస్) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ తదితరులు కూడా కేసీఆర్ను కలుసుకున్నారు. వీరితో కేసీఆర్ దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. జాతీయ రాజకీయాల తీరుతెన్నులు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, చూపాల్సిన పరిష్కార మార్గాలపై వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం తన ఇంటికి వచ్చిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామికి కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు. తికాయత్ను కవిత ఆహ్వానించారు. ఈ మధ్యాహ్న భోజనం సమావేశంలో తెలంగాణ మాడల్ ఆసక్తికర కేంద్ర బిందువుగా మారిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకప్పుడు అప్పులు- ఆత్మహత్యలతో సతమతమైన తెలంగాణ వ్యవసాయాన్ని, వినూత్న నిర్ణయాలు, పథకాలతో 8 ఏండ్లలోనే లాభసాటిగా మార్చిన విషయాన్ని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ప్రపంచమంతా ఉపాధికోసం పట్టణాలవైపు వలస పోతుంటే, తెలంగాణలో మాత్రం జనం పట్టణాల నుంచి పల్లెలకు వలసపోతున్నారని, పల్లెలు బాగుపడ్డాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం అక్కర్లేదని ఆయన వారికి వివరించారు. సాగునీటి సౌకర్యాల మెరుగుదలతో వ్యవసాయ విస్తీర్ణమే కాదు; సగటు పంట దిగుబడి కూడా బాగా పెరిగిందని ఆయన తెలియజెప్పారు. ఫలితంగా భూముల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని, ఇప్పుడు తెలంగాణలో మూడెకరాలున్న ప్రతి రైతూ కోటీశ్వరుడని కేసీఆర్ గణాంకాలతో సహా వివరించారు.
తెలంగాణ ప్రగతిని మేమూ వింటున్నాం
వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి గురించి తాము కూడా వింటున్నామని తికాయత్ బృందం పేర్కొన్నది. తెలంగాణ మాడల్ను దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా వారు ముఖ్యమంత్రితో అన్నట్టు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకాలం వ్యవసాయంపై చూపించాల్సినంత శ్రద్ధ చూపించలేదని, అందువల్లే సాగు రంగం నాశనమైందని వారు అభిప్రాయపడ్డారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కూడా సేద్యాన్ని మరింత కుంగదీస్తున్నాయని వారు ఆవేదన వెలిబుచ్చారు. ‘వ్యవసాయం, రైతుల కోసం తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై చాలా రాష్ర్టాల్లో చర్చ జరుగుతున్నది. తెలంగాణ పథకాలు తమ రాష్ర్టాల్లో కూడా ఉంటే బాగుండని అక్కడి రైతులు భావిస్తున్నారు. అంతేకాదు; ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టాల్సిందిగా తమ నాయకులను డిమాండ్ కూడా చేస్తున్నారు. మా సంఘాల్లోని రైతు ప్రతినిధులు దీన్ని గుర్తించారు’ అని తికాయత్ బృందం పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వ్యవసాయ మాడల్ను దేశమంతా విస్తరించాల్సిన తక్షణావసరం ఉన్నదని వారు కేసీఆర్తో ఉద్ఘాటించారు. అవకాశమొస్తే ఈ బాధ్యతను స్వీకరించాల్సిందిగా సూచించారు. ఇందుకు కేసీఆర్కు రైతులందరి దీవెనలు, ఆశీస్సులు ఉంటాయని కూడా భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ వ్యవసాయ మాడల్ను దేశమంతా విస్తరిస్తామనే హామీతోగనక రంగంలోకి దిగితే, ప్రాంతాలు, రాష్ర్టాలకు అతీతంగా రైతులు బ్రహ్మరథం పడతారని కూడా వారు పేర్కొన్నట్టు తెలిపాయి. గత కొంతకాలంగా వివిధ అంశాల్లో మోదీ సర్కారుకు చురకలు వేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ వేత్త సుబ్రమణ్యస్వామి, దేశ ఆర్థిక స్థితిగతులపై కేసీఆర్తో చర్చించారు. మోదీ సర్కారు పరిపాలన ఏమీ బాగా లేదనీ, జాతీయ స్థాయిలో పరిస్థితులను మార్చాలంటే మోదీ సర్కార్ గద్దె దిగాల్సిందేనని కేసీఆర్ ఇటీవల ఉద్ఘాటించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని, రాష్ర్టాల హక్కులను కాల రాస్తున్నదని, దేశాన్ని బాగు చేసేందుకు అవసరమైతే తన రక్తం ధారపోస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతోను, ఆర్జేడీ నేతలు లాలు, తేజస్వి, జనతాదళ్(ఎస్) నేత దేవెగౌడతోనూ సమాలోచనలు జరిపారు.
నేడు రాంచీకి కేసీఆర్
శుక్రవారం సీఎం కేసీఆర్ జార్ఖండ్ రాధాని రాంచీలో పర్యటించనున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్తో ఆయన భేటీ అవుతారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. జేఎంఎం కూడా టీఆర్ఎస్లాగానే రాష్ట్రం కోసం ఉద్యమించిన పార్టీ కావడం ప్రస్తావనార్హం. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జేఎంఎం బేషరతుగా మద్దతు ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా శిబుసొరేన్ తెలంగాణలో పర్యటించి మరీ తన మద్దతును తెలిపారు. ప్రస్తుతం ఆయన కుమారుడు హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.