భిక్కనూరు, మార్చి 19: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అన్నదాతలు రోడ్డెక్కారు. మంగళవారం భిక్కనూరు మండలం అంతంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకోతో రెండు వైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలుగు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో కామారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఆరుగాలం కష్టపడి, లక్షలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలను కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులవుతున్నా అధికారులు ఒక్కరు రాలేదని, నష్టమెంత జరిగిందో లెక్క తీయడం లేదని మండిపడ్డారు.
ఏడీఏ అపర్ణ, వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపామని అధికారులు తెలుపగా, పొలాల్లోకి రాకుండానే నివేదిక ఇలా తయారుచేశారని రైతులు ప్రశ్నించారు. పరిహారం ప్రకటించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. డీఎస్పీ నాగేశ్వర్రావు వచ్చి సముదాయించడంతో రైతులు శాంతించారు. రేపటిలోగా పరిహారం ప్రకటించాలని, లేకపోతే గురువారం కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.