Telangana | సూర్యాపేట, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం ఒరిగింది? ఒక్క ఎకరమైనా అదనంగా సాగులోకి వచ్చిందా? ఈ ప్రశ్న వేసేవారికి తిరుగులేని జవాబు తుంగతుర్తి నియోజకవర్గం! ఒకప్పుడు బీడు భూములతో ఎడారిగా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడుతున్నది!! ఇంచు భూమి కూడా ఖాళీగా కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత గోదావరి జలాలు ఎస్సారెస్పీ కాలువ ద్వారా ఈ ప్రాంతాన్ని ముద్దాడటమే ఇందుకు కారణం. ఈ నియోజకవర్గంలో వ్యవసాయ యోగ్యమైన భూమి 1,41,265 ఎకరాలు ఉండగా ప్రస్తుత యాసంగి సీజన్లో 1,12,210 ఎకరాల్లో వరి సాగవుతున్నది. కాళేశ్వరం జలాలు రాక పూర్వం 2018-19 యాసంగిలో వరి సాగు విస్తీర్ణం కేవలం 17,620 ఎకరాలు. ఐదేండ్లలో పెరిగిన వరి సాగు విస్తీర్ణం అక్షరాల 94,590 ఎకరాలు.ఈ లెక్క చాలదా.. కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన విజయాన్ని అర్థం చేసుకోవడానికి? ఐదేండ్ల క్రితం నియోజకవర్గం మొత్తం మీద పండిన వరి ధాన్యం విలువ రూ.98 కోట్లు కాగా ఈ సీజన్లో రూ.624 కోట్ల విలువైన ధాన్యం పండుతుందని అంచనా. ఐదేండ్లలో వరి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి, రైతుల ఆదాయం ఆరేడు రెట్లు పెరగడం విశేషం. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగైందని, సిరులు పండుతున్నాయని ఇక్కడి రైతులు సంతోషంగా, సగర్వంగా చెప్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎటు చూసినా ఎండిన చెరువులు, మోడుబారిన వృక్షాలు, బీడు భూములు కనిపించేవి. కరువు విలయతాండవం చేసేది. అన్ని పంటలు కలిపినా సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలు దాటేది కాదు. మిలినదంతా పడావే. అది కూడా వందల మీటర్ల లోతున బోర్లు వేసి.. మోటర్లు బిగించి.. రోజుకు దాదాపు పది నుంచి పదిహేను విడతలుగా వచ్చే కరెంటు కోసం ఎదురు చూస్తూ.. సద్దులు కట్టుకొని.. మోటర్ల వద్దనే మకాం పెడితే అంతో ఇంతో పంట పండేది. అలాంటిది నేడు నియోజకవర్గమంతా పచ్చగా కళకళలాడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతున్న దశలోనే నియోజకవర్గ పరిధిలోని కాలువలు, తూముల పరిస్థితిని జిల్లా మంత్రి జీ జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అధికారులను వెంటబెట్టుకొని తిరిగి ఎక్కడికక్కడ మరమ్మతులు చేయించారు. కాలువల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగింపజేయడం, పిల్ల కాలువలను తవ్వించడంతో నేడు నీళ్లు సాఫీగా కింది వరకు వెళ్తున్నాయి. ఏటా రెండు పంటలు పండుతున్నాయి.
నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. తెలంగాణ రాక ముందు జొన్న, పెసర, కంది పంటలు వేసేవాళ్లం. నీళ్లు లేక పంటలు పండించలేక ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎస్సారెస్పీ కాలువ ద్వారా మా భూమి పక్క నుంచే పోతున్నాయి. దీంతో రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఇప్పటివరకు 25 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.1,50,000 పోను రూ.3,50,000 మిగిలింది. మా ఇంట సిరుల పంట పడింది. నాకు చాలా ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కు రుణపడి ఉంటా.
-పాక గణేశ్, రైతు, వర్ధమానుకోట, నాగారం మండలం
ఎస్సారెస్పీ కాలువ ద్వారా వెలిశాల నుంచి మా తండాకు గోదావరి జలాలు వస్తున్నాయి. ఇప్పుడు పంటలు బాగా పండుతున్నయి. ఎక్కడా గుంట భూమి కూడా ఖాళీగా లేదు. బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉన్నది. కుంటలు, చెరువుల్లో కూడా నీళ్లు ఉండటంతో తండాలోని రైతులు ఉత్సాహంతో వ్యవసాయం చేస్తున్నారు. కాలువ నీళ్లు రాకుంటే భూములు పడావు ఉండేవి.
-నీలాబాయి, మహిళా రైతు, మర్రికుంటతండా, తిరుమలగిరి
కొంతమంది మూర్ఖులు కాళేశ్వరం జలాలు ఎక్కడ వస్తున్నాయని మాట్లాడుతున్నరు. వారికి సరైన సమాధానం మా నియోజకవర్గంలో పారే నీళ్లే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు నా హయాంలో రావడం ఎమ్మెల్యేగా నేను చేసుకున్న అదృష్టం. ఒకప్పుడు వెనుకబడ్డ నియోజకవర్గం నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు పోటీగా అభివృద్ధి చెందుతున్నది. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి.
-గాదరి కిశోర్కుమార్, ఎమ్మెల్యే, తుంగతుర్తి