Telangana | అలవిగాని హామీలతో తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. పాచిక పారకపోవడంతో కుట్రలకు తెరలేపింది. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ధరణి వంటి వాటితో సంబురంగా బతుకుతున్న అన్నదాతల బతుకుల్లో నిప్పులు పోయాలని కంకణం కట్టుకున్నది. అధికారంలోకి వస్తే తమ తొలి టార్గెట్ వారేనని బాహాటంగానే చెప్పేసింది.
ధరణిని రద్దు చేస్తామని, 24 గంటల కరెంటు స్థానంలో మూడు గంటల కరెంటుతో సరిపెడతామని చెబుతూ ఇప్పటి నుంచే రైతులను భయపెడుతున్నది. కాంగ్రెస్ పాలనలో అనుభవించిన కష్టాలు ఇంకా కండ్ల ముందు కదలాడుతుం డడంతో రైతన్నలు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను గోసపుచ్చుకున్న హస్తం పార్టీని ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కనివ్వకుండా తరిమికొడతామని శపథం చేస్తున్నారు. ధరణిని కాంగ్రెస్ రద్దు చేయడం కాదు..తామే వారిని రద్దు చేస్తామని బాజప్తా చెబుతున్నారు.
స్టార్టర్ డబ్బా ఇప్పక మూడేండ్లయింది
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి సరఫరా చేస్తున్న నాణ్యమైన 24 గంటల కరెంట్తో ఫ్యూజ్వైర్ ఎయ్యక, బోరు మోటారు స్టార్టర్ డబ్బా స్క్రూ ఇప్పక మూడేండ్లయ్యింది. కాంగ్రెసోళ్ల కాలంలో రైతులకు కంటి నిండా కునుకు లేదు. ఇచ్చిన కరెంటు ఏప్పుడస్తుందో ఎప్పుడు పోతుందో లైట్ బుగ్గను చూస్తుంటిమి. ఇప్పుడు రేవంత్రెడ్డి రైతుల పాలిట శనిలా దాపురించాడు.
కాంగ్రెసోళ్లు పెట్టిన కష్టాలు తలుచుకుంటే సలిజరమస్తది. ఒకవేళ మూడు గంటల కరెంటు ఇస్తే వ్యవసాయం బంద్ పెట్టుకోవాల్సి వస్తది. మా పక్క ఉన్న కర్ణాటకలో రైతులను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. అక్కడ మూడు గంటల కరెంట్ కూడా మంచిగ ఇస్తలేరంట. స్వయంగా కన్నడ రైతులు మాదగ్గరికి వచ్చి చెబుతున్నరు. మంచి చేసిందెవరో, చెడుచేసింది ఎవరో మనందరికీ తెలుసు. తెలిసి ముళ్లకంపపై కాళ్లు పెడితే ఏమైతదో తెలుసు. పదవుల కోసం అబద్ధ్దాల హామీలనిస్తూ మళ్లీ అందరినీ మోసం చేస్తుండ్రు. బంగారంలాంటి 24 గంటల కరెంటునిస్తున్న సీఎం కేసీఆర్ను గెలిపించుకుందాం.
-పాకాల గంగాధర్, రైతు, కల్హేర్, సంగారెడ్డి జిల్లా
రైతు సచ్చిపోయినా సాయం చేయలే
నాకు బుద్ధి తెలిసినప్పటి సంది ఎవుసం చేస్తున్న. తెలంగాణ అచ్చినకాన్నుంచి ఎవుసం మంచిగా సాగుతున్నది. కరెంట్ 24 గంటలుంటంది. స్టార్టర్ ఒత్తంగనే మోటర్ల నుంచి నీళ్లు దుంకుతున్నయ్. ఏ రంది లేకుండా రెండు పంటలు పండించుకుంటున్నం. కాంగ్రెసోళ్లు మాత్రం ఇప్పుడొచ్చి ఎడ్డమంటే తెడ్డమంటున్నరు. ఎవుసం తెల్వకుండానే ఏదేదో మాట్లాడుతున్నరు. రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ ఇస్తమంటడు.
10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలని సలహా ఇస్తండు. ఇంకో ఆయన 24 గంటలు వట్టిగనే ఇత్తమని నరుకుతుండు. వాళ్లు అధికారంల ఉన్నప్పుడు ఏం జేసిన్రు? కరెంట్ సక్కగ ఇయ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందు పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలె. ఆఖరుకు రైతు సచ్చిపోయినా ఆ కుటుంబానికి కనీసం సాయం చేయలె. మొన్న అధికారంలోకి వచ్చిన కర్ణాటకల అరిగోస పెడుతున్రు. అక్కడ కరెంట్ గతేందంటే సప్పుడు జేయరు. గిసోంటళ్లను ఎట్లా నమ్మేది? వాళ్లకు ఎట్లా ఓటేసేది? కాంగ్రెస్ వస్తే కరెంట్ ఖతమైతది. మళ్లీ పాత కథే ముందటికి వత్తది.
– బెల్లంకొండ ప్రకాశ్ రెడ్డి, రైతు నాగారం, మంథని రూరల్ ,పెద్దపల్లి జిల్లా
మూడు గంటలకు మూడు మళ్లు తడ్వయ్
మూడు గంటల కరెంటుతో మూడు మళ్లు గూడ పారవు. నేను 25 ఏండ్ల సంది ఎవుసం చేస్తున్న. అప్పట్ల కరెంటు ఎప్పుడు వస్తుండెనో? ఎప్పుడు పోతుండెనో? తెల్వకపోయేది. లోవోల్టేజీతో బోరు మోటరు కాలిపోయేది. ఇగ ట్రాన్స్ఫార్మర్ కాలితే ఎన్ని కష్టాలో. ఒక్కొక్కసారి పంటలు ఎండిపోయేవి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఉచితంగా 24 గంటల కరెంటిస్తాండు. చెరువుల్లోకి నీళ్లు రావడంతో ఏటికేడు ఎకరం వరి సాగును పెంచుకుంటున్నం. నేను ఇప్పుడు ఆరెకరాలు వరిని పండిస్తున్నా.. నాలెక్కనే శానా మంది పంటలు పండిస్తున్నరు. కాంగ్రెస్ను నమ్మితే అరిగోస పడాల్సి వస్తది. రైతులు ఆలోచించే ఓటు వేస్తరు ఈసారి.
– నాగిడి నర్సిరెడ్డి, రైతు, లింగాలఘనపురం (జనగామ)
కాంగ్రెస్ చిల్లర మాటలకు బుద్ధి చెబుతాం
ధరణి వచ్చిన తర్వాత ఎలాంటి కష్టం లేకుండా మండల కేంద్రాల్లోనే సేవలు అందుతున్నాయి. అలాంటి ధరణిని తీసేసి బంగాళాఖాతంలో కలుపుతామంటున్న కాంగ్రెస్ చిల్లరమాటలకు బుద్ధి చెప్తాం. బకాసురుల్లా మారి భూమిని కాజేసేందుకే కాంగ్రెస్ నేతలు ధరణిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కాంగ్రెసోళ్ల హయాంలో భూ సమస్యల పరిష్కారానికి నెలలు, సంవత్సరాలు పట్టేవి. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవాళ్లం. వేలకు వేలు లంచాలు ముట్టజెప్పాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. అదనంగా పైసా ఖర్చు లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
-మంఖాల కృష్ణారెడ్డి, ఎలిమినేడు, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
కాంగ్రెస్ మమ్మల్ని సంపుకతిన్నది
నాకు పదెకరాల భూమి ఉంది. వరి వేస్త. కరెంట్ కోసం గతంల చానా కష్టాలు పడ్డం. మూడెకరాలకు మించి నీళ్లందలేదు. కాంగ్రెస్ మమ్ముల చంపుకతిన్నది. ఏండ్లకేండ్లు పాలించి ఏం చేయలే. ఇప్పుడు కేసీఆర్ చెయ్యవట్టి మా ముఖాలు తెల్లబడ్డయి.
24 గంటల కరెంట్తో నాపదెకరాలు పారించుకుంటున్న. సంబురంగా ఎవుసం చేసుకుంటుంటే రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ అంటున్నడు. అది ఏ మూలకు సరిపోతది. ఇంకా 10హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటుండు. ఎవడు కొనిస్తడు? చెప్పమనండి. 10 హెచ్పీ మోటర్ పెడితే ట్రాన్స్ఫార్మర్లు ఉండయి. కాలిబూడిదయితై. లైన్లు బందైతయి. రేవంత్వి పనికిరాని మాటలు. మూడు గంటలు ఇచ్చినా.. 10 హెచ్పీ మోటర్లు అన్నా ఎవుసం సర్వనాశనం. ఇప్పుడున్న 24 గంటల కరెంట్ ఇస్తేనే రైతులకు సరిపోతుంది.
– పడాల దేవేందర్, కోనాపూర్, కొడిమ్యాల మండలం, జగిత్యాల జ్లిలా
రైతును రాజులా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే
కాంగ్రెస్ మొదటి నుంచి రైతు వ్యతిరేకే. 50 ఏళ్లకు పైగా పాలించినా రైతులకు చేసింది గుండు సున్నా. కరెంటు సక్కగ ఇవ్వలే. నీళ్లు కూడా సక్కగా ఇవ్వలే. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలే. ఆఖరికి రైతులు ఆకలి బాధలతో చచ్చిపోయినా,అప్పుల పాలైన ప్రాణం తీసుకున్నా పట్టించుకోలే.
ఆ పార్టీ నాయకులు ఇప్పుడొచ్చి మూడు గంటలు కరెంటు చాలు.. రైతులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉంది.10 హెచ్పీ మోటర్ల భారాన్ని రైతులు భరించలేరు. తెలంగాణలో 24 గంటలు కరెంటు సక్రమంగా అందించడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతులను రాజులా మార్చింది తెలంగాణ ప్రభుత్వమే. కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులు సుఖంగా ఉంటారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మేదేలేదు.
– ఎనిక ముసలయ్య, రైతు, కూనవరం, మణుగూరు మండలం, భద్రాద్రి జిల్లా
సీఎం కేసీఆర్ మా కష్టాలను తీర్చారు..
ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి రూపాయి ఖర్చు లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. మీ సేవ కేంద్రంలో ధరణి పోర్టల్లో భూమికి ఉన్న విలువ ప్రకారం ఆన్లైన్లో పైసలు కడితే చాలు. మిగతా వారికెవరికీ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. భూముల వివరాలు కూడా ఆన్లైన్లో ఉండడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రైతుల మేలుకోరి ఇంత మంచి ధరణి వ్యవస్థను తెచ్చిన సీఎం కేసీఆర్కు రైతులందరి తరఫున ధన్యవాదాలు. మా కష్టాలను తీర్చిన సీఎం కేసీఆర్ను కాదని ఇంకొకరికి అధికారం కట్టబెట్టే ప్రసక్తే లేదు. ధరణి వ్యవస్థను రద్దు చేస్తామన్న కాంగ్రెసోళ్లను మేము రద్దు చేస్తాం. ఇంకోసారి మా ఇండ్లకు ఓటు అడిగేందుకు వస్తే తరిమి తరిమి కొడతాం.
– అనిల్ కుమార్, రైతు బాన్సువాడ, కామారెడ్డి జిల్లా
ఎవుసం చెయ్యాల్నా? వద్దా?
అప్పట్ల కరెంటుతో ఎన్నో కష్టాలు వడ్డం. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చుడుతోటి గిప్పుడిప్పుడే మంచిగైతున్నాం. ప్రతి గుంటకూ నీరందుతున్నది. పంట మొత్తం చేతికి వస్తున్నది. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు వడ్డరు. కరెంటు ఎప్పుడు అస్తదో, ఎప్పుడు పోతదో తెల్వకపోయేది. పారిన మడే పారుతుండే. ఎండిన మడి ఎండిపోతుండే. ఆ బాధలు ఇప్పుడు లేవు. మళ్లీ కాంగ్రెస్ సర్కారు వస్తే రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటు ఇస్తమంటుండు. మేం ఎవుసం చెయ్యాల్నా? వద్దా? మీది నుంచి 10 హెచ్పీ మోటర్లు పెట్టాల్నట. గిైట్లెతే నీళ్లు ఎండిపోవుడు తోటి మా ఇండ్లు కూడా గుల్ల అవుతాయి.
-లింగాపురం శ్రీనివాస్రెడ్డి, ముప్కాల్, నిజామాబాద్ జిల్లా
10హెచ్పీ మోటర్లతో ఎడారే
చిన్న రైతులు ఎవరూ 10హెచ్పీ మోటర్లు వాడరు. ఎవుసం బావులకు 10 హెచ్పీ మోటర్లు వాడితే బాయిల నీరు తొందరగ ఖాళీ అయితది. మోటర్ మీద వజను పడి కాలిపోతది. దానికి ఎంత ఖర్చు అయితదో దేవుడికి ఎరుక. రేవంత్రెడ్డికి ఎవుసం అంటే అస్సలు తెల్వదు. సన్న, చిన్నకారు రైతులు 10హెచ్పీ మోటర్లు వాడరని తెలుసుకోవాలె. 10హెచ్పీ మోటరు వాడితే భూమి ఎడారైతది. సీఎం కేసీఆర్ ఇప్పుడు ఇస్తున్న కరెంటు చాలు ఉన్న కాడికి పారుతది. 3 గంటల కరెంట్ ఇస్తే మొదటి మడి కూడా పూర్తిగా పారదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవుసం తెల్వకపోవడంతో రైతుల అవసరాలు ఎలా తెలుస్తయ్. 24గంటలు నిత్యం విద్యుత్ను సరఫరా చేసే కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు అండగా ఉంటారు.
– బండ రాములు, రైతు, పెంబర్తి, జనగామ