ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండుతున్నయ్. పుష్కలమైన నీళ్లుంటే ఎకరం పొలంలో ఏడుపుట్ల పంట పండించవచ్చు. కలలో కూడా సాధ్యం కాదనుకునేంత దిగుబడిని తన కల్లంలో ధాన్యపు రాసిపోసి చూపించాడు! ఎకరం పొలంలో ఏడు పుట్ల వడ్లు ఎట్లా పండించాడో చెప్తున్నాడు నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని బొడంగపర్తి రైతు ‘ఏడుపుట్ల’ యాదయ్య!
(నమస్తే తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి)
నీరుంటేనే వరి, లేకుంటే పత్తి. ఇంతే మా ఎవుసం. మా ఊరి పెద్ద చెరువులో పూడిక బాగా చేరింది. నీటి నిల్వ తగ్గిపోయింది. వానకాలం పంటగా వరి పెట్టేది. యాసంగికి నీళ్లు ఉండకపోయేది. అప్పుడు ఏ పంటా వేయకపోయేది. వానకాలం కూడా తక్కువ నీళ్లుంటే వరి వేయకుండా పత్తి వేసేది. రోజంతా బోరు పోసినా నీళ్లు అర ఎకరం పారకపోయేది. అందుకని పంట తగ్గించుకునేది. మిషన్ కాకతీయ పథకానికి మొదటి విడతలో మా పెద్ద చెరువు ఎంపికైంది. దానితోపాటే రెండు కుంటల్లో కూడా పూడిక తీయించారు. మిషన్ కాకతీయకు ముందు రోజుల్లో బోరు కొద్దిగా నీళ్లు పోసేది. పూడిక తీశాక నిరుడు, ఈ యేడు ఎండాకాలంలో కూడా చెరువు ఎండిపోలేదు. నిరుటి నుంచి బోరు నిండుగా పోస్తున్నది. ఇప్పుడు రైతులందరూ వరి పెట్టినా బోర్లు మంచిగనే పోస్త్తున్నయి.
పొలంలో సాగు బడి..
ఎండాకాలంల దుక్కి దున్ని ఎండబెట్టి ఉంచుత. వరి పంటకు ముందు పెసలు లేకుంటె జీలుగులు చల్లుత. ఆ పంటని తొక్కించి మురగబెడత. భూమికి బాగా బలమొస్తది. వరికి ముందు పత్తి వేస్తే.. ఆ పత్తిని తగులబెట్టకుండ, ట్రాక్టర్తో తొక్కించి నీటిలో మురగబెడుత. ఇట్ల కంపోస్ట్ చేసి భూసారం పెంచుత. తర్వాత వరి పండిస్త. నేను 933 రకం వడ్ల గింజల్ని విత్తనం కోసం కొంటున్న. ఎకరానికి ఆరు కిలోలు సరిపోతయి. నారు మడిలో విత్తనాలు పలుచగా చల్లుత. నాటు వేసేప్పుడు పురుగు మందులు కొట్టడానికి, ఎరువులు చల్లడానికి అక్కడక్కడా దారులు వదులుత. నాటు పెట్టేప్పుడే జింక్, డీఏపీ చల్లుత. మళ్లీ పదిహేను రోజులు కాంగనే పిలక వేసేందుకు యూరియా చల్లుత. కలుపు తీపిస్త. పురుగు పడితే మందు కొడత. వరి పొట్టకు రాంగనే డీపేపీ, పొటాష్, యూరియా కలిపి చల్లుత. మందు చల్లిన రెండు, మూడు రోజులకు పొట్టకు తెగులు రాకుండ పురుగు మందు కొడత. ఇదే నా సాగు పద్ధతి అంటున్నడు రైతు యాదయ్య.
కేసీఆర్ పెట్టుబడి.. రైతుకు రాబడి
ఎకరానికి ఆరుకిలోల విత్తనాలు (రూ.2,100) అవసరం. ఎకరం వరి చెలకని ట్రాక్టర్ దున్నడానికి మూడు గంటలు (రూ.4,000) పడుతుంది. కలుపు తీయడానికి కూలీలకు 2,000 రూపాయలు. డీఏపీ, యూరియా, పురుగుమందులు, గుళికలు, వరికోతకు కలిపి రూ.12 వేలు ఖర్చవుతుంది. ఎకరం వరి సాగుకు మొత్తం రూ.20 వేల పెట్టుబడి ఖర్చయిందని యాదయ్య లెక్క కట్టిండు. రైతు బంధు సాయం ఎకరానికి రూ.5,000 పోగా తన జేబులోంచి పెట్టిన పెట్టుబడి ఎకరానికి రూ.15 వేలు. ఇక దిగుబడి అంటారా? 21 పుట్లను మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. రెండు లక్షల రూపాయల చెక్కులిచ్చింది. పెట్టుబడి 45 వేలు పోగా యాదయ్యకు వరి పంట మీదనే 1 లక్షా 55 వేలు లాభం వచ్చింది.
ఒకప్పుడు.. ఈ యేటి పంటకు నీళ్లుంటయా? ఉండవా? అని ఆలోచించి విత్తనాలు కొనేది. మిషన్ కాకతీయ తర్వాత అట్ట లేదు. ఏ పంటకు గిట్టుబాటుంటదనే ఆలోచిస్తున్నం. చెరువు ఒకసారి నిండితే రెండేండ్ల వరకు బోర్లు పోస్తయి. చెరువు నిండిందనే ధైర్యంతో ఏడాదిన్నర క్రితం (2021లో) యాసంగిలో మూడు ఎకరాల్లో వరి వేసిన. నాటేసిన తర్వాత మంచిగా దుబ్బు కట్టింది. మందులు చల్లిన, పురుగు మందు కొట్టిన. కలుపు తీసి, ఎండిపోకుండా ఎప్పుడూ నీరు పారించిన. కోతకొచ్చిన పంట లెక్కపెబితే నేనే కాదు మా ఊరోళ్లంతా నమ్మలేకపోయారు! ఎకరానికి ఏడు పుట్ల లెక్క మూడెకరాల్లో 21 పుట్లు పండినయ్! ఇంత పంటని నా జీవితంలో ఎన్నడూ సూడలే! వినలే! ఆ తర్వాత సంవత్సరం మళ్లీ వరి పెట్టిన. వానకాలం పంట దిగుబడి కొంచెం తక్కువొచ్చింది. యాసంగిలో కూడా వరి పెట్టిన. ఈ సారి మళ్లీ ఎకరానికి ఏడు పుట్లు పండినయ్. వానకాలం పంట ఆరు లేకుంటె ఆరున్నర పుట్ల వడ్లు పండుతున్నయ్. యాసంగి అయితే ఏడు పుట్లు పండుతున్నయ్. మిషన్ కాకతీయ వల్ల మాకు మేలు జరిగింది. ఇప్పుడు రెండు పంటలు వేస్తున్నం. వానకాలం పత్తి పెట్టి, యాసంగికి వరి పెడుతున్నం. లేకుంటే రెండు పంటలు వరి వేస్తున్నం.