Telangana Farmers | కేసీఆర్ జెయ్యవట్టి తెలంగాణలో పంటలు మంచిగ పండుతున్నయ్. స్టార్టర్ ఎప్పుడు నొక్కినా జలజలమంటూ నీళ్లు ఉరుక్కుంటూ వస్తున్నయ్. అన్నదాతకు ఇంతకుమించి ఇంకేంగావాలె. ఆళ్లేమో మేమొస్తే మూడు గంటలు కరెంటిస్తమంటరు. 10 హెచ్పీ మోటరుతో మస్తు పండించుకోవచ్చంటరు. హస్తం పార్టోళ్ల మాటలు నమ్మితే ఆగమవుడు తప్ప ఇంకేముంటది. భూములను పడావు పెట్టుకోవడం తప్ప రైతులకు దిక్కేముంటది. ఆళ్లొద్దు.. ఆళ్ల కరెంటద్దు. తెల్లందాక పొలాల పొంటి ఉరికిన రోజులు మర్సిపోతే కదా. కాంగ్రెస్కు ఓటేసి బాగున్న మా బతుకులను మళ్లా ఆగం జేసుకొంటామా?.. రాష్ట్రంలోని రైతన్నల మాటది.
కాంగ్రెస్కు ఓటేసి కష్టాలు తెచ్చుకోవద్దు
సీఎం కేసీఆర్ మా కష్టాలను తీర్చిండు. ఏ ఇబ్బందులు లేకుండా చేసిండు. 24 గంటల కరెంట్తో పాటు రైతుబంధు ఇస్తూ, రైతు రుణాలు కూడామాఫీ చేసిండు. కాంగ్రెస్ నాయకులు రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని అనడం సిగ్గుచేటు.
10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే దాదాపు లక్ష ఖర్చయితది. కాంగ్రెస్కు పొరపాటున ఓటు వేసి మళ్లీ కష్టాలు కొనితెచ్చుకోవద్దు. వారు అధికారంల ఉన్నప్పుడు అరకొర కరెంటు ఇవ్వడంతో రైతులు నానా తంటాలు పడ్డారు. మోటర్లు కాలి పోయినయి. రైతులు పైసపైసకు తిప్పలు పడేవారు. వర్షాలు సరిగా కురిస్తే పంటలు పండుతాయి లేకపోతే వదిలేద్దామనే పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి ఏ ఒక్క రైతు పొలం కూడా ఎండిపోకుండా చేసిండు.
– ఎనుగందుల ఐల్రెడ్డి, చెన్నారావుపేట, వరంగల్
కౌలు రైతులు అన్యాయమైపోతారు
కాంగ్రెస్ మూడు గంటల కరెంటు ఇస్తే నాలాంటి కౌలు రైతులు అన్యాయమైపోతారు. మూడు గంటల కరెంటుతో వరి దొయ్య కూడా పారదు. సీఎం కేసీఆర్ సార్ ఇస్తున్న నాణ్యమైన కరెంటుతో ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లి నీళ్లు పెట్టుకుంటున్నాం.
10 హెచ్పీ మోటర్లతో బావుల్లో నీళ్లు వట్టిపోతాయి. ట్రాన్స్ఫార్మర్లపై లోడుపడి కాలిపోతాయి. గతంలో ఆరు గంటలు ఇస్తేనే ఆగమయ్యాం. మూడు గంటల కరెంటుతో పంట దిగుబడి రాదు. కౌలు కట్టలేని పరిస్థితులు వస్తాయి. నాణ్యమైన 24 గంటల విద్యుత్తు కావాలంటే కేసీఆరే ఉండాలి.
– రాసమల్ల కనకయ్య, రైతు, ఆరెంద, మంథని మండలం, పెద్దపల్లి
పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా ఎలాంటి అవినీతికి తావులేకుండా రైతులు తహసీల్ కార్యాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నరు. గతంలో భూములు పట్టా చేయించుకునేందుకు ఎన్ని రోజులు తిరిగినా పని కాకపోయేది. ధరణి వచ్చినంక ఆన్లైన్ విధానంలో సులభమైన పద్ధతిలో స్లాట్ బుక్ చేసుకొని పది నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నరు. కాంగ్రెస్ తీసుకొస్తామని చెబుతున్న భూమాత పోర్టల్లో కౌలుదారు, అనుభవదారుల కాలం పెడతామని చెబుతున్నరు. అదొస్తే ఒకరి భూమలు మరొకరికి రెవెన్యూ అధికారులు మార్చే అవకాశం ఉంటది.
– అల్లూరి అనిల్రెడ్డి, ఓగులాపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా
తొమ్మిదేండ్లుగా ఆ రంది లేదు
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవుసం ఆగమైతది. మూడు గంటల కరెంటు సరఫరా వల్ల పంటలకు సకాలంలో నీరందక ఎండిపోయి నష్టం జరుగుతది. సాగుకు 24 గంటల కరెంట్ అవసరం లేదని మూడు గంటలు సరిపోతుందని కాంగ్రెస్ అంటున్నది.ఎలా సరిపోతుందో చెప్పాలి.
కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎట్లుండేది పదేండ్ల కిందటే చూశాం. ఇప్పుడా రంది లేదు. లో వోల్టేజీ సమస్య లేదు. కోతలు లేవు. రైతుల మేలుకోరే కేసీఆర్ పాలన ఉంటేనే రైతాంగం బాగుంటది. మా జోలికి వస్తే కాంగ్రెస్ను తరిమికొడుతం. ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతం.
– సార్ల జితేందర్రెడ్డి, రైతు, రేగుంట, మల్లాపూర్ మండలం, జగిత్యాల జిల్లా
ధరణిని తీసేస్తామనడం మూర్ఖత్వం
ధరణి తీసేస్తే మళ్లీ పట్వారీల చుట్టూ తిరగాల్సిందే. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. ఆ సమస్యల పరిష్కారానికి పట్వారీలు, తాహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పట్వారీ వ్యవస్థలో ఒకరి భూములు మరొకరివిగా మారుతాయి. రైతులకు నష్టం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు, మార్పులు, చేర్పులు వెంటనే జరిగిపోతున్నాయి. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వచ్చి ధరణిని రద్దుచేసి భూమాత పోర్టల్ను తీసుకొస్తే పట్వారీల చుట్టూ తిరగాల్సిందే. ధరణి రద్దుచేస్తామంటున్న కాంగ్రెస్కు ఓటుతో తగిన బుద్ధి చెబుతాం. భూములకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ధరణిని తీసుకువస్తే.. కాంగ్రెస్ దాన్ని తీసేస్తాననడం మూర్ఖత్వం. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారో చెబుతారు. కానీ కాంగ్రెస్ భిన్నంగా అందరికీ నష్టం చేస్తామని చెప్పడం విడ్డూరం. రైతులే కాదు.. ఎవరూ కాంగ్రెస్ను నమ్మరు. అన్ని వర్గాలకూ అండగా ఉన్న బీఆర్ఎస్కే మద్దతిస్తారు.
-ఆనంద్, రైతు, అన్నారం, కొడంగల్
మూడు గంటల కరెంట్మస్త్ ఎలా అయితది?
గతంల కరెంట్ కోసం ముప్పు తిప్పలు వడ్డం. కరెంటు ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకపోతుండె. రాత్రి పూట కరెంటు తోటి తెల్లందాక పొలాల పొంటి ఉరుకుతుంటిమి. తెలంగాణ అచ్చినంక కరెంట్ తిప్పలు తప్పినయ్. సీఎం కేసీఆర్ సార్ రోజుకు 24 గంటల కరెంట్ ఇచ్చుడుతోటే రెండు పంటలు ఏస్తున్నా.
రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు మస్తు అయితదని.. 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటుండు. ఆయనకు దిమాక్ ఉండి మాట్లాడుతున్నడో.. మరి ఎట్లా మాట్లాడుతున్నదో అర్థం అయితలేదు. ఒకవేళ మోటర్లు పెట్టినా ఒక్క దెబ్బకే నీళ్లు ఖతం అవుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చుడుతోటి మాకు రంది లేకుండా పోయింది. మళ్లా కష్టాలు పాలు జేసేందుకు చూస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు రైతులు అంతా తయారుగా ఉన్నారు.
– మల్లేశ్వర్రెడ్డి, రైతు, కమలాపూర్, నవీపేట, జిల్లా నిజామాబాద్
గసొంటోళ్లను ఓట్లతో కనుమరుగు చేయాలె
కాంగ్రెస్, తెలుగుదేశంవాళ్లు అధికారంల ఉన్నప్పుడు కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయేటివి. సబ్స్టేషన్ల వద్ద లొల్లి చేసేటోళ్లం. వందల ఎకరాలు నీళ్లు లేక పడావు ఉండేటివి. బోర్లు పడక అప్పుల పాలయ్యేటోళ్లం. ఎవుసం వొదిలేసి బతుకుదెరువు కోసం చానామంది వరంగల్, హైదరాబాద్ పోయిన్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటిస్తూ చెక్డ్యామ్లు కట్టడంతో నీళ్ల సౌలత్ బాగా పెరిగి మస్తుగ పంటలు పండుతానయి.
పచ్చని పంటలతో ధాన్యం దిగుబడి పెరిగింది. రైతుబంధుతో పెట్టుబడి తిప్పలు తప్పాయి. సమయానికి విత్తనాలు, ఎరువులు దొరుకుతానయి. ఎరువుల కోసం లైన్ల నిలబడ్డ రోజులు మళ్ల వస్తే రైతులు తట్టుకోరు ఇగ. పండిన పంటలను సర్కారే కొని రైతుల్ని కాపాడుతున్న కేసీఆరే మళ్ళ రావాలె. కాంగ్రెసోళ్ల్ల మాటలు చూస్తుంటే ఆ రోజులను తెచ్చెటట్టే ఉన్నారు. గసొంటోళ్లను ఓట్లతో కనుమరుగు చేయాలె. లేదంటే మన బతుకులను ఆగం చేస్తరు.
– నల్ల సరోత్తంరెడ్డి, రైతు, గుమ్మడవెల్లి, టేకుమట్ల, జయశంకర్ భూపాలపల్లి
అన్ని పనులు క్షణాల్లో జరుగుతున్నయ్
ధరణితో రైతులకు కష్టాలు తప్పాయి. అన్ని పనులు క్షణాల్లో జరుగుతున్నాయి. సమస్య ఏ ఆప్షన్ కిందికి వస్తుందో స్పష్టంగా తెలుసుకున్న తరువాతే దరఖాస్తు చేసుకుంటే వేగంగా పరిష్కారమయ్యే వెసులుబాటు కల్పించారు. రెవెన్యూ సేవలు సకాలంలో అందుతున్నాయి. దళారీ వ్యవస్థ సమసిపోయింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో జరుగుతున్నాయి.
పోర్టల్లో భూమి వివరాలు ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో చూసుకోవచ్చు. తహసీల్దార్, సబ్రిజిష్ర్టార్ కార్యాలయాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మ్యుటేషన్ అవుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫర్ మిస్సింగ్ సర్వే ఎక్స్టెంట్ ఆప్షన్ను జతచేయడంతో భూమి సంబంధిత వివరాలపై సమస్యలు నమోదు చేయగానే జిల్లా కలెక్టర్కు చేరుతుంది. దీంతో సమస్య వెంటనే పరిష్కారం అవుతున్నది. ధరణితో ఎలాంటి నష్టం లేదు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
– పూనెం రమణ, రైతు, మొండితోగు గ్రామం, ఇల్లెందు మండలం, భద్రాద్రి జిల్లా
కాంగ్రెస్ కాలంలో ఎవుసం అంటే ఏడుపొచ్చేది
10హెచ్పీ మోటర్లు పెట్టాలని కాంగ్రెసోళ్లు అంటున్నరు. ఆ మోటర్లు పెడితే గరీబు రైతులకు పైసల మోతయితది. పైపులు, ట్రాన్స్ఫార్మర్లకు ఎక్కవ ఖర్సయితది. అవి ఎవరు కట్టాలె? ఎవుసానికి ఏ మోటర్లు వాడుతరో కూడా వాళ్లకే తెలువదాయో? కాంగ్రెస్ కాలంలో ఎవుసం అంటే ఏడుపొచ్చేది.
అప్పుడు కరెంటు, నీళ్లు లేకుండె. మస్తు తిప్పలుపడ్డం. కరెంటు ఎప్పుడొస్తదో.. ఎప్పుడుపోతదో తెల్వక రాత్రుల్లు బాయిల కాడనే జాగారం చేసినం. అప్పుడంత గోసవెట్టి, ఇపుడు ఏదో చేస్తమని కాంగ్రెసోళ్లు వస్తున్నరు. వాళ్లు అచ్చేదిలేదు.. సచ్చేదిలేదు. వచ్చినా చేసేదేమీ లేదు. కేసీఆర్ సార్ జెయ్యవట్టి రైతులు మంచిగబతుకుతున్నరు. ఆయన దయతోనే కరెంటు, నీళ్లు ఫుల్లున్నయి. నాకున్న ఎకరం పొలంల రెండు పంటలు పండుతన్నయి. తెలంగాణ రాకముందు బీడుండె. కరెంటు కోసం నాడుపడ్డ కష్టాలు చాలు. మీరు వద్దు.. మీ మూడు గంటల కరెంటు.. 10హెచ్పీ మోటర్లు వద్దే వద్దు.
– మాడుగుల రాజయ్య, రైతు, గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల
రైతులు మళ్లీ అడ్డమీద కూలీలవుతారు
రైతుబంధు కింద ప్రతి రైతుకు రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అంటాన్రు. కానీ, ఎకరానికి అంటలేరు. వారి మాటలు అర్థం చేసుకోకుండా ఓటు వేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే.
3 గంటలు కరెంట్ ఇస్తే ఒక్క మూల కూడా తడవదు. రైతులందరు ఒకేసారి 10 హెచ్పీ మోటర్లు ఆన్చేస్తే లోడు పెరిగి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయి. ఇప్పుడున్న స్టాటర్లు, లక్షల రూపాయలు పెట్టి భూమిలో వేసిన పైప్లైన్ పనిచేయవు. రాత్రిపూట కరెంట్ ఇస్తే మళ్లీ రాత్రనక, పగలనక టార్చిలైట్లు పట్టుకొని బావుల కాడికి పోవాల్సి వస్తది. 3 గంటల కరెంట్తో సాగు విస్తీర్ణం తగ్గుతుంది. రైతులు, రైతు కూలీలు మళ్ల గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లి అడ్డమీద కూలీలుగా మారుతరు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినంక 24 గంటల విద్యుత్తు, పెట్టుబడి సాయం, సాగునీరు ఇత్తాంటే రైతులు సంతోషంగ రెండు మూడు పంటలు పండిస్తాన్రు. గ్రామాల్లో సుత కూలీలకు బతుకుదెరువు దొరుకుతాంది.
– సంకపల్లి శ్రీనివాస్రెడ్డి, కేసముద్రం,మహబూబాబాద్
మళ్లా ఆఫీసుల చుట్టూ తిప్పుతరు
కాంగ్రెస్కు ఓట్లు వేస్తే ధరణి పోర్టల్ రద్దు చేసి, పూర్వకాలం రాజ్యం తీసుకొస్తారు. ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. గతంలో కాంగ్రెస్ పాలనలో పైరవీల రాజ్యం నడిచింది. దళారుల ప్రమేయం బాగా ఉండేది.
ధరణి తీసేస్తే రైతుల భూములను మార్పిడి చేసే అవకాశం వస్తది. రైతుల మధ్య గొడవలు జరుగుతాయి. పటేల్, పట్వారీ వ్యవస్థ తీసుకొస్తే రైతులకు కష్టాలు మొదలవుతాయి. పట్టాదారు కాలంలో తిరిగి అనుభవదారు, కౌలుదారు కాలం పెట్టడంతో పట్టాదారులకు ఇబ్బందులు వస్తాయి. పటేల్, పట్వారీ వ్యవస్థ తీసుకువస్తే రైతులకు రాజకీయ నాయకులు, ఆఫీసులు, కోర్టుల చుట్టు తిరుగుడే వస్తది. మళ్లీ పాత రోజులు వస్తే భూములకు భద్రత ఉండదు.
– సంజీవ్కుమార్, సజ్జారావుపేట తండా, మొగుడంపల్లి మండలం , సంగారెడ్డి జిల్లా