హైదరాబాద్:పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమకానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్తో సాగునీరు అందించే పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు రైతు బంధు డబ్బులు విడుదల చేయడంతో రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేక్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వానాకాలం పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా నేటి నుంచి రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేటలోని రైతు వేదిక వద్ద పాలాభిషేకం చేశారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్, వరంగల్ గ్రామీణ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనుండటంతో ధరూర్ మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.