నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 7: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్న సీఎం కేసీఆర్కు కర్షక లోకం కృతజ్ఞతలు తెలిపింది. రైతుబంధు సాయం 50 వేల కోట్లకు చేరువవ్వడంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటా యి. గ్రామాల్లో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీలు తీయగా, మహిళలు రంగురంగుల ముగ్గులతో తమ అభిమానాన్ని చాటుకొన్నారు. పల్లెపల్లెనా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పంట దిగుబడులతో అభిషేకం చేశారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి, రాములపల్లిలో నిర్వహించిన సంబురాల్లో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఎడ్లబండిని తొలుతూ గ్రామాల్లో పర్యటించారు. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘రైతుబంధు’ ప్రపంచంలోనే గొప్ప పథకమని కొప్పుల అభివర్ణించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. బీజేపీ ద్వంద్వ విధానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని, ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో రైతుబంధు వారోత్సవాల్లో వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా ఆమె ట్రాక్టర్ నడిపారు. మహబూబాబాద్ రైతు వేదికలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్నాయక్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపురంలో పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్లో ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు ఎడ్లబండ్ల ర్యాలీ తీశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి రైతులకు పంపిణీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్దఎత్తున రైతుబంధు సంబురాలు జరుపుకొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
జనగామ నియోజకవర్గంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా ఒక్కరోజే 136 గ్రామాల్లో 2.40 లక్షల ముగ్గులు వేసి రికార్డు సృష్టించారు. జనగామ పట్టణంలోని ధర్మకంచ జడ్పీ పాఠశాలలో నిర్వహించిన రంగవల్లులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.