వరంగల్, మార్చి 22(నమస్తేతెలంగాణ): నువ్వా నేనా అన్నట్టు మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. పెరిగిన డిమాండ్ కారణంగా గత కొన్ని రోజులుగా మిర్చి ధరలు క్వింటాల్కు రూ.40 వేలకుపైగా నమోదవుతున్నాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం క్వింటాల్ రూ. 45 వేలు పలికిన దేశీరకం మిర్చి ధర మంగళవారం ఏకంగా రూ.48 వేలకు చేరింది. మునుపెన్నడూ మిర్చికి ఈ స్థాయి ధర పలకలేదని, ఈ మార్కెట్ చరిత్రలోనే ఇదే ఆల్టైం రికార్డు అని అధికారులు చెప్తున్నారు. ఇదే సమయంలో సింగిల్పట్టీ మిర్చికి కూడా రికార్డు స్థాయి ధర పలకడం విశేషం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాల్ రూ.45 వేలు వచ్చింది. ఊహించని విధంగా దక్కుతున్న ధరలతో మిర్చి రైతులు సంబురపడుతున్నారు.