బొడ్రాయిబజార్, ఏప్రిల్ 26 : ఎన్నిమార్లు విన్నవించినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని హమాలీలు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కాంటాలను నిలిపివేసి సమ్మెకు దిగారు. ఇదే సమయంలో కాంటాలు వేయాలని కోరుతూ రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆర్డీవో వేణు మాధవరావు, మార్కెట్ కార్యదర్శి రాహుల్ హమాలీలతో మాట్లాడి శనివారం ఉదయం వరకు కాంటాలు వేయిస్తామని చెప్పడంతో రైతులు వెనుదిరిగారు. మార్కెట్లో వినియోగిస్తున్న సూపర్ బస్తాలతో వేసవికాలంలో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు హమాలీలు వాపోయారు. తక్షణమే గన్నీ బస్తాలు పెట్టాలని, తమ లైసెన్స్లు రెన్యూవల్ చేయాలని, ఖరీదుదారులే బస్తాలు, పురుకోసలు తెచ్చివ్వాలని డిమాండ్ చేశారు.