రుద్రంగి, మే 10 : సీజన్ ఏదైనా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు గోసపడుతూనే ఉన్నారు. పోయిన సీజన్లో యూరియా, సాగునీటి కోసం తండ్లాడిన అన్నదాతలు, ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో ఇబ్బందులు పడుతున్నారు.
రుద్రంగి కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులవుతున్నా కొనేవాళ్లు దిక్కు లేరని ఆగ్రహిస్తూ ఆదివారం రోడ్డెక్కారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి మండల కేంద్రంలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డుపై ఉంచి దాదాపు అరగంటకుపైగా బైఠాయించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.