ఆదిలాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : సీసీఐ అధికారుల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. భీంపూర్ మండలానికి చెందిన రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పత్తిని వాహనాల్లో తీసుకొచ్చారు. పత్తిలో తేమ ఎక్కువగా ఉన్నదని, కొంతసేపు ఆగాలని సీసీఐ సిబ్బంది సూచించారు. రెండు గంటల తర్వాత రైతులు పత్తిని కొనుగోలు చేయాలని కోరగా 9 శాతం తేమ ఉన్నట్టు నిర్ధారించి సీసీఐ లీజుకు తీసుకున్న జిన్నింగ్ మిల్లుకు పంపారు. అక్కడ సీసీఐ సిబ్బంది నాణ్యత లేదంటూ పత్తిని అన్లోడ్ చేయడానికి తిరస్కరించారు.
విసుగు చెందిన రైతులు తమ పంటను తక్కువ ధరకే రూ.5,500లకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. పంట కొనుగోళ్లలో సీసీఐ అధికారుల తీరును నిరసిస్తూ మార్కెట్ యార్డులో ఆందోళన చేపట్టారు. సీసీఐ అధికారులు, ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై దళారుల వద్ద నుంచి అక్రమంగా పత్తిని కొనుగోలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీసుకొచ్చిన పంటను కొనుగోలు చేయకుండా ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు. రైతుల ఆందోళనతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ అధికారులు రైతులకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, దళారులకు తీసుకొచ్చి పంట నాణ్యతను పరిశీలించకుండా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.