హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైతు దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రైతు వేదికలను వినియోగించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో రైతు వేదికలను మామిడి తోరణలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. వ్యవసా య రంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను తెలియజేసేలా రైతు వేదికల వద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యు త్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల గురించి తెలిపేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. రైతులకు కరపత్రాలు కూడా పంపిణీ చేయనున్నారు. ఉత్సవాల్లో వ్యవసా య, ఉద్యాన శాఖ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొననున్నారు. అందరూ సాముహిక భోజనాలు చేస్తారు.
అన్ని శాఖలకూ అవకాశం
రైతులను సంఘటిత పరిచి వారికి సాగులో కొత్త పద్ధతులు, సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించే సమావేశాల నిర్వహణ కోసం ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. రాష్ట్రంలో ప్రతి క్లస్టర్కు ఒకటి చొప్పున 2,601 రైతు వేదికలు ఉన్నాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.571 కోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను రైతు వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఇతర ప్రభుత్వ శాఖలు కూడా తమ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. విద్యుత్తు, పంచాయతీరాజ్, వైద్యారోగ్య తదితర శాఖలు తమ కార్యక్రమాల కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.