మంథని, మార్చి 7: సాగునీటి కోసం రైతులు గురువారం పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారిపై బైఠాయించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, ముత్తారం మండలం రామకృష్టాపూర్, గంగాపురి తదితర గ్రామాలకు చెందిన రైతులు మంథనికి చేరుకొని సుమారు గంటన్నర పాటు ఎర్రటి ఎండలో నిరసన తెలిపారు.
వేలల్లో పెట్టుబడి పెట్టామని..పంట చేతికొచ్చే దశలో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోయారు. ప్రజాప్రతినిధులైనా స్పందించి కాలువల ద్వారా నీరందించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు రైతులపై దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో మంథని ఆర్డీవో హనుమానాయక్ చేరుకొని ఈ నెల 9వ తేదీలోగా సాగునీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.