నారాయణరావుపేట, ఫిబ్రవరి 6: మల్లన్న సాగర్ నుంచి తమ పంటలకు పొలాలకు నీరు అందించాలని సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, అంకంపేట రైతులు శుక్రవారం సిద్దిపేట – ముస్తాబాద్ రహదారి లక్ష్మీదేవిపల్లి సేజీపై రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ రాజేశ్ రైతులకు సర్ది చెప్పి రాస్తారోకో విరమింపజేశారు.