హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): నిరుడు రికార్డుస్థాయి ధర పలికిన పత్తికి ఈసారి మాత్రం మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 7,020గా ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.6,500 చెల్లిస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా మద్దతు ధరకు రూ.100 తక్కువగా రూ.6,900 చెల్లిస్తున్నది. నాణ్యత లేదని, పొడవు తగ్గిందని పలు రకాల సాకులు చెప్తూ మద్దతు ధరలో కోతపెడుతున్నారు. ఇది పత్తి రైతును కలవరపెడుతున్నది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 30 లక్షల బేళ్ల పత్తి కొనుగోలుకు మార్కెటింగ్శాఖ ప్రణాళికలు రూపొందించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు కలిపి కొన్నది 13 లక్షల బేళ్లు మాత్రమే. ప్రైవేటు వ్యాపారులు 7 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేస్తే, సీసీఐ 6 లక్షల బేళ్లతో సరిపెట్టింది. సీజన్ ప్రారంభంలో తొలుత క్వింటాలు పత్తికి రూ. 7,500 వరకు ధర పలికి ఊరించింది. ఆ తర్వాత క్రమంగా పడిపోయింది.
నిరుడు ఒకానొక దశలో క్వింటాలు పత్తికి రూ. 14 వేలు పలికి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత తగ్గినప్పటికీ సగటున రూ. 10 వేలు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి మాత్రం ధరలు దారుణంగా పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎకరా పత్తి సాగుకు సగటున రూ. 30 నుంచి రూ.32 వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 3-4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రైతుకు లభించేది గరిష్ఠంగా రూ.28 వేలు మాత్రమే. అంటే ఎకరాకు నాలుగైదు వేలు నష్టపోతున్నారు. నష్టాల నేపథ్యంలో మద్దతు ధరను రూ. 10 వేలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిరుడు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈసారి 5 లక్షల ఎకరాలు తగ్గి 45 లక్షలకే పరిమితమైంది. దీనికితోడు ఈ సీజన్లో వర్షాలు ఆలస్యం కావడం కూడా పత్తిసాగు, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు చెప్తున్నారు.