Paddy Procurement | మంచిర్యాల, సిద్దిపేట, నిజామాబాద్, నల్లగొండ, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదేండ్ల కాలంలో రైతులు ఎన్నడూ అనుభవించని కష్టాలను ఈ మూడు నెలల్లోనే చవిచూశారు. కరువు, అకాల వర్షాలకు పంట పోగా..మిగిలిన పంటనైనా అమ్ముకుని అప్పు లు తీర్చుకుందామంటే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల రూపంలో మరో కష్టం వచ్చి పడింది. తమ నంబరు ఎప్పుడొస్తుందో తెలియక రైతు లు ధాన్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీనికితోడు కొనుగోళ్లలోనూ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు నెలకొన్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సొమ్ము ఎప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతుందో తెలియక రైతులు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
కేటాయింపుల్లో గందరగోళం
మంచిర్యాల జిల్లాలో మొదట డీఆర్డీఏ, పీఏసీఎస్ ఏజెన్సీల ద్వారా 235 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించా రు. ఆ తర్వాత డీసీఎంఎస్ ఏజెన్సీని కలుపుకొని 262 కేంద్రాలని చెప్పారు. మూడోసారి మంచిర్యాల నియోజకవర్గంలో పీఏసీఎస్లు వద్దంటూ మెప్మా ఏజెన్సీని చేర్చుకొని జిల్లాలో 275 సెంటర్లు పెడుతున్నట్టు ఏప్రిల్ మొదటి వారంలో ఓ సైన్డ్ కాపీని విడుదల చేశారు. తాజాగా, జాయింట్ కలెక్టర్ ఇదే విషయంపై స్పందిస్తూ 262 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డీసీఎస్వోను అడిగితే కేంద్రాల లెక్క ఇంకా ఖరారు కాలేదని చెప్పి గందరగోళానికి తెరతీశారు.
రూ. 50 వేలకు ఓ కేంద్రం!
ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనూ అవినీతి రాజ్యమేలుతున్నది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ. 50 వేలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. జైపూర్ మండలంలో ఒకే వ్యక్తికి బినామీ పేర్లతో నాలుగు సెంటర్లు ఇచ్చినట్టు తెలిసింది. కన్నేపల్లి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములకు కొనుగోలు కేంద్రాలు కేటాయించినట్టు తెలిసింది. జైపూర్ మండలం శివ్వారం గ్రామానికి చెందిన ఆర్న సమ్మయ్య డీసీఎంఎస్ కోసం రూ. 3 లక్షల డిపాజిట్ చెల్లించారు. అంతలోనే స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పిన మరో వ్యక్తికి టీసీఎంఎస్ కేంద్రాన్ని కేటాయించారు. దీనిపై సమ్మయ్య రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ వికాస్రాజ్కు ఫిర్యాదు చేయడంతో ఆయన శివ్వారంలో కొత్త డీసీఎంఎస్ సెంటర్ ఇన్చార్జి నియామకాన్ని ఆపేయాలంటూ జిల్లా అధికారులకు మెమో ఇచ్చారు.
సిద్దిపేటలో అంతంత మాత్రంగా కొనుగోళ్లు
సిద్దిపేట జిల్లాలో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయిలో జోరందుకోలేదు. ఇప్పటి వరకు 167 మంది రైతుల నుంచి 876 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. 81 మంది రైతుల పేర్లను మాత్రమే ట్యాబ్లో నమోదు చేశారు. సోమవారం నాటికి రూ. 49 లక్షలు రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉండగా ఇంకా జమకాలేదు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఈ రెండు మండలాల్లో కలిపి పీఏసీఎస్ ఆధ్వర్యంలో 27 సెంటర్లకు కేవలం 5 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలోని 13 సెంటర్లకు గాను 3 సెంటర్లలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి.
ప్రైవేటు వ్యాపారుల హవా
నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి మరోలా ఉన్నది. టోకెన్ నంబరు ఎప్పుడొస్తుందో తెలియక వేచి చూసేకంటే ప్రైవేటు వ్యాపారులకే పంటను తెగనమ్ముకోవడం మేలని రైతులు భావిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు పొలాల్లో వాలిపోతున్నారు. సన్నరకం వడ్లను రూ. 2 వేలకే కొనుగోలు చేస్తూ రైతన్నను దారుణంగా ముంచుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ఏ గ్రేడ్ రకానికి రూ.2,203, బీ గ్రేడ్ రకానికి రూ.2,183 చొప్పున దక్కుతుండగా దళారులు మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సన్నాలకు భారీ డిమాండ్ ఉన్నా ముందస్తు చెల్లింపులు పేరిట బురిడీ కొట్టిస్తున్నారు.
వారం రోజులకు కాంటా
నల్లగొండ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఈ నెల 1న 370 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం నాటికి జిల్లాలో మొత్తం 14,680 మంది రైతుల నుంచి రూ.227.71 కోట్ల విలువైన 1,03,363 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 4,732 మంది రైతులకు రూ.77.68 కోట్లను చెల్లించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వారం రోజులకు కాంటా వేస్తుండడంతో అకాల వర్షం ఎప్పుడొచ్చి మీద పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దొడ్డు రకం ధాన్యం కూడా కొనుగోలు
మిల్లర్లు ఈసారి రైతుల నుంచి దొడ్డురకం ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లు సాధారణంగా సన్నాలను మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేస్తుంటారు. కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి కారణంగా దిగుబడి పడిపోయింది. ఫలితంగా వచ్చే సీజన్ వరకు మిల్లులు నడిపేందుకు ధాన్యం లభించడం లేదు.ఈ నేపథ్యంలో మిల్లర్లు సన్నాలతోపాటు దొడ్డురకాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర రూ. 2,203 కాగా, మిల్లర్లు రూ. 1800 నుంచి రూ. 2 వేల వరకు చెల్లిస్తున్నారు. తేమ, తాలుతో లేకుండా నేరుగా మిల్లుల వద్దే కొనుగోలు చేస్తుండడంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు.
ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే కొనుగోలు కేంద్రాలు
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే కొనుగోలు కేంద్రాలు కేటాయిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పలానా వాళ్లకే కేంద్రాలు కేటాయించాలంటూ అధికారులకు ఎమ్మెల్యేలు లేఖలు రాస్తున్నారు. ఈ మేరకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ నెల 8న జాయింట్ కలెక్టర్కు రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా డీసీఎంఎస్, పీఏసీఎస్, డీఆర్డీఏ(ఐకేపీ), మెప్మా ఏజెన్సీల ద్వారా ధాన్యం కొనుగోలు చేసింది. దాదాపు తొమ్మిదేండ్లు అవే కేంద్రాలు నడుస్తూ వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి చేస్తున్న ధాన్యం కొనుగోళ్లలోనే పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు రాజకీయాలు ప్రారంభించారు. పీపీ సెంటర్ ఇన్చార్జీలను తీసేసి వారి స్థానంలో కాంగ్రెస్ నాయకులకు, వారి బినామీలకే కేంద్రాలు ఇవ్వాలంటూ లేఖలు రాస్తున్నారు.
ఎమ్మెల్యే చెప్పినోళ్లకే ఇస్తమంటున్నరు
నాకు బూరుగుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉంది. కొన్నేండ్లుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నా. ఇందుకోసం ఏజెన్సీకి రూ.3 లక్షలు డిపాజిట్ చేశాను. యాసంగి లో ఎమ్మెల్యే జోక్యంతో నా స్థానంలో మరొకరికి కేంద్రం కేటాయిస్తున్నారు. అధికారులను అడిగితే ఎమ్మెల్యే చెప్పినోళ్లకే ఇస్తామని, కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలని అంటున్నరు. జేసీని కలిసినా న్యాయం జరగడం లేదు. నాకు న్యాయం జరగకుంటే కోర్టుకెళ్తా.
-రాజ్కుమార్, బూరుగుపల్లి,భీమారం మండలం మంచిర్యాల
ఆరు రోజులవుతున్నది
సిద్దిపేట మార్కెట్యార్డుకు వడ్లు తెచ్చి ఆరు రోజులవుతాం ది. రోజూ వడ్లు ఎండ బోస్తున్నం. ఈ రోజు కొంటాం రేపు కొంటమని అంటున్నరు. తేమ శాతం పరీక్ష చేయలేదు. వాన మొగులైతే భయమవుతాంది. -కొల్పుల నర్సయ్య, రైతు,ఎన్సాన్పలి ్ల, సిద్దిపేట జిల్లా
బోనస్ 500 ఇవ్వాలి
కాంగ్రెస్ హామీ ప్రకారం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలి.మూడెకరా ల్లో వరి సాగుచేసిన. కొంత ఎండిపోగా పండిన పంటకు బోనస్ ఇస్తే మాలాంటి రైతులకు నష్టం జరగకుండా ఉంటుం ది.ముందుగా వడ్లు అమ్ముకున్న రైతు లు డబ్బులు ఎప్పుడు పడుతాయా అని ఎదురు చూస్తున్నరు.
-అన్నాడి ప్రభాకర్రెడ్డి, రైతు,హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా