మహబూబ్నగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు విరివిగా వరి ధాన్యాన్ని పండిస్తుండటంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ధాన్యాగారంగా మారింది. వరి పండించే రైతుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉన్నది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, లాభదాయకమైన పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా రైతులు వరి వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి.
వర్షాలు ఆలస్యంగా పడినప్పటికీ రైతులు తమ బోరుబావుల నుంచి పంటలకు సాగునీరు అందించి కాపాడారు. ఒక దశలో పంటలు ఎండిపోతాయని ఆందోళన చెందినా.. వరుణుడు కరుణించడంతో రైతుల ఆశలు చిగురించాయి. ఎక్కడా ఎకరం ఎండకుండా వరికి పుష్కలంగా సాగునీరందింది. ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణానది ఉప్పొంగడంతో జూరాల ఎగువ, దిగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేసి గత ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలిచింది.
7,73,096 ఎకరాల్లో వరి సాగు..
వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం ఈ వానకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,73,096 ఎకరాల్లో వరి పండించారు. సుమారు 18,71,196 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్టు అంచనా. దీంతో మహబూబ్నగర్ జిల్లాలో 1.90 లక్షల ఎకరాలు, నారాయణపేటలో 1.60 లక్షలు, వనపర్తిలో 1,87, 544 ఎకరాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 80 వేల ఎకరాలు, నాగర్కర్నూల్ జిల్లాలో 1,55,552 ఎకరాల్లో వరి సాగైంది.
భీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల కుడి, ఎడమ కాల్వల కింద వరి సాగు చేశారు. దీంతో మహబూబ్నగర్ జిల్లాలో 3.90 లక్షల మెట్రిక్ టన్నులు, నారాయణపేట జిల్లాలో 3.84 లక్షలు, వనపర్తి జిల్లాలో 5,10,539, జోగులాంబ గద్వాల జిల్లాలో 1.20 లక్షలు, నాగర్కర్నూల్ జిల్లాలో 4,66,657 టన్నుల ధాన్యం పండినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా వరి ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. రోడ్ల వెంట ఖాళీ స్థలాల్లో రైతులు ధాన్యాన్ని ఆరబెడుతూ అక్కడికక్కడే వ్యాపారులకు అమ్ముతున్నారు.