Komatireddy Venkat Reddy | వలిగొండ, ఫిబ్రవరి 12 : జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని, నోరుపారేసుకుని అవమానించాడని బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరెల్లి నుంచి ఛత్తీస్గఢ్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం, వర్కట్పల్లి, పొద్దటూరు, ఏదుళ్లగూడెం, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, మల్లేపల్లి, లోతుకుంట గ్రామాల రైతులు భూములను కోల్పోతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఆయా భూముల్లో అధికారులు మార్కింగ్ చేశారు. కోట్ల విలువైన భూములను కోల్పోతున్న మల్లేపల్లి రైతులు తమకు న్యాయం చేయాలని బుధవారం హైదరాబాద్లోని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి వారి గోడు వినకుండానే అడ్డగోలుగా మాట్లాడినట్టు రైతులు వాపోతున్నారు. ‘ఎందుకొచ్చిండ్రు. ఎవడు రమ్మన్నడు మిమ్మల్ని. మీ ఎమ్మెల్యేను తీసుకొని రాపోండ్రి’ అంటూ గదమాయించాడని భువనగిరిలో వారు మీడి యా ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. చేసేదేమీ లేక వినతి పత్రాన్ని మంత్రి పీఏకు అందజేసి వెనుదిరిగినట్టు వారు తెలిపారు.
చేతకాకపోతే రాజీనామా చేయండి
నారాయణఖేడ్, ఫిబ్రవరి 12: అభివృద్ధి పనులు చేపట్టడం చేతకాకపోతే పదవికి రాజీనామా చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డిని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ నుంచి జూకల్, చందాపూర్, సత్యగామ, అనంతసాగర్, బండ్రాన్పల్లి వరకు రోడ్డు అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం రూ.1.48 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది గడిచినా రోడ్డు పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.