నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13 : ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జ్యాపం జరుగుతున్నదని, లారీల కొరతతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ పలు జిల్లాల్లో బుధవారం ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోలులో ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ సుల్తాన్పూర్ వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గంటపాటు నిరసన తెలిపారు. గ్రామంలో రెండు కేంద్రాల అవసరం ఉండగా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఒకే కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని, నెల రోజులు గడుస్తున్నప్పటికీ తూకం వేయకుండా టోకెన్లు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. అటువైపు వెళ్తున్న జిల్లా అదనపు కలెక్టర్ పాండు రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఇన్చార్జి వంశీ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నాడని అదనపు కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేశారు. రెండు, మూడు రోజుల్లో హమాలీలను సమకూర్చి ధాన్యం తూకం వేయిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో రైతులు రాస్తారోకోకు దిగారు. వెంటనే లారీలు వచ్చేలా చూడాలని, ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్ శివప్రసాద్, రామాయంపేట సీఐ అక్కడికి చేరుకొని కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని రైతులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో రైతులు బాధలు పట్టించుకోవడం లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. వడ్లు, మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పెనుబల్లిలో బుధవారం ధర్నా నిర్వహించారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.