Dharani | స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాలనలో పైరవీకారులు పుట్టుకొచ్చారు. ఊరూరా భూ వివాదాలు. గజానికి గట్టుపంచాయతీ. రాత పహాణిలో రాత్రికి రాత్రే మారిపోయే హక్కుదార్లు. రైతును రైతుగా గుర్తించడానికీ ఏండ్లతరబడి తిరుగాల్సిన దుస్థితి. ఎన్ని కొట్లాటలుంటే అంత పండుగ. లీడరే బ్రోకరై.. పంచాయితీల్లో ఊరిపెద్దగా మారిపోయేవాడు. ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా రచ్చబండ తీర్పులు చెప్పడం. 60 ఏండ్లలో భూ వివాదాల్లో జరిగిందిదే. అలాంటి సెటిల్మెంట్లకు, అవినీతికి ఆస్కారం లేకుండా చేసింది ధరణి. దానిని తొలగించి పాత పద్ధతిని తెస్తామంటున్నది కాంగ్రెస్. ధరణిని తీసేస్తామంటే దళారుల రాజ్యం తెస్తామని పరోక్షంగా చెప్పడమే. రైతుల్ని కొట్టి, రాబందులను మేపుతామని బహిరంగంగా ప్రకటిస్తున్నట్టే.
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్తో 99 శాతం మందికి లాభం ఉండగా.. ఒక్క శాతం మందికి మాత్రమే తీవ్ర నష్టం జరుగుతున్నది. ఆ ఒక్క శాతం మంది ఎవరో కాదు.. పైరవీకారులు, దళారీలు, పంచాయితీలు చెప్పే పెద్ద మనుషులు, ఊర్లల్లో సెటిల్మెంట్లు చేసే రాజకీయ నాయకులు. ఇలాంటి వాళ్లంతా కాంగ్రెస్ హయాంలో పుట్టుకొచ్చినవాళ్లే. గ్రామాల్లో భూ పంచాయితీలు పెట్టి, దందాలు చేసి, రైతును పీల్చిపిప్పి చేసి బతకడం మాత్రమే వాళ్లకు వచ్చు. ధరణితో రికార్డులన్నీ డిజిటలైజ్ కావడంతో వారికి ఇబ్బందులు తలెత్తాయి. అందుకే.. కొత్త విధానంపై కోపం పెంచుకున్నారు.
పోర్టల్పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. గతంలో రైతు పహాణీ తీసుకోవడమనేది ఒక బ్రహ్మపదార్థం. వీఆర్వో చుట్టో, గిర్దావర్ చుట్టో అనేకసార్లు తిరిగితేగానీ చేతికి వచ్చేది. అందులోనూ చాలా సందర్భాల్లో తెలుగు అంకెలు రాసి ఇస్తుండె. అది రైతుకు అర్థం కాదు. వీఆర్వో ఇచ్చిన కాగితం కదా అని ఇంట్లో దాచిపెట్టుకునుడే తప్ప.. అందులో విస్తీర్ణం ఎంత రాసిండ్రో తెల్వదు. తర్వాత ఆ విస్తీర్ణాన్ని అధికారులు ఇష్టం వచ్చినట్టు మార్చేవాళ్లు. తర్వాత ఏమయ్యేది..? ఏదో ఒకరోజు ఎవడో ఒకడొచ్చి ఆ భూమి నాది అంటూ బెదిరిస్తడు. రైతుకు, వాడికి మధ్య పంచాయితీ మొదలైతుండె. సమస్య పరిష్కరిస్తమని చెప్పి దళారీలు, పెద్ద మనుషులు మధ్యలో దూరేటోళ్లు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లదిక్కు మాట్లాడుతుండె. లేకపోతే గొడవ పెద్దదై కేసులు నమోదు చేసుకోవడం, కోర్టుకు వెళ్లడం వంటివి జరిగేవి. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ధర పలికేటిది. కానీ, ఇప్పుడు.. రూ.40 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్య నడుస్తున్నది. తెలంగాణ వచ్చినంక భూముల ధరలకు రెక్కలొచ్చినయి.
నేషనల్ హైవేల పక్కన కనీసం రూ.2 కోట్ల నుంచి 3 కోట్లు, రాష్ట్ర హైవేల పక్కన అయితే రూ.కోటిన్నర దాకా, ఏదైనా డాంబర్ రోడ్డు పక్కన ఉంటే రూ.50-70 లక్షలు, మట్టి రోడ్డు ఉంటే రూ.40-50 లక్షలకు తక్కువ కాకుండా ధర పలుకుతున్నది. ఇందుకు కారణాలు అనేకం. బడుగు, బలహీన వర్గాలవారు కూడా ఇప్పుడిప్పుడే భూమిని కొనుక్కునే, వ్యవసాయం చేసుకునే స్థితికి చేరుకున్నరు. దీంతో కమతం చిన్నగా మారింది, రైతులు ఎక్కువయ్యారు. ఫలితంగా ప్రతి గజం జాగ కూడా విలువైనదే అయ్యింది. వాళ్లకు ఉండే గుంటనో, రెండు గుంటలో, ఎకరంలోనో కొంత భూమిని వదులుకోవడానికి ఎవరూ ఒప్పుకోరు. ఇప్పుడు.. వ్యవసాయం పూర్తి లాభదాయకమైంది. ఏ సమస్యా లేదు. ప్రభుత్వమే రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నది. విత్తనాలు సరఫరా చేస్తున్నది. ధాన్యం కొంటున్నది. వ్యవసాయం అత్యద్భుతంగా లాభసాటిగా మారింది. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
ఇప్పుడు తెలంగాణలో భూమి పరిమితంగా ఉండగా, కావాలనుకునేవారు ఎక్కువ మంది ఉన్నరు. దీనివల్ల భూమి అనేది అత్యంత విలువైన వనరుగా మారింది. ఎక్కడైనా విలువైన వనరు ఉంటే.. దానికోసం గొడవలు, యుద్ధాలు జరుగుతుంటాయి. గతంలో తక్కువ ధరలు ఉన్నప్పుడే ఊళ్లల్లో గెట్ల పంచాయితీలు ఉంటే.. ఇప్పటి పెరిగిన ధరలకు ధరణి లాంటి పోర్టల్ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. భూ వివాదాలు ఏ స్థాయిలో ఉండేవో, అవి ఎంతటి పరిణామాలకు దారితీసేవో ఆలోచించండి. మనదేశంలో భూమి కోసం చనిపోయేది ఇద్దరే. ఒకరు సైనికుడు, ఇంకొకరు రైతు. గ్రామాల్లో గజం భూమి కోసం కూడా ఏండ్లకేండ్లు గెట్ల పంచాయితీలు నడుస్తాయి. ఎందుకంటే ఆ రైతుకు భూమి మీద ఉన్న ప్రేమ.
‘నా భూమి నా దగ్గర్నే ఉండాలె’ అన్న మమకారం. తన కుటుంబ ఆస్తి అని, పిల్లలకు తాను ఇచ్చే వారసత్వ ఆస్తి అనే భావన. అలాంటి భూమి వేరేవాళ్లకు చెందొద్దు, అన్యాక్రాంతం కావొద్దు అనే పట్టుదల రైతుల్లో ఉంటుంది. ఈ రోజు తెలంగాణలో పెరిగిన భూముల ధరలకు ఎన్ని పంచాయితీలు అయితుండె. ఎన్ని హత్యలు జరుగుతుండె. ఎన్ని తలకాయలు పలుగుతుండె.. ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇప్పుడు తెలంగాణ పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. కారణం ధరణి పోర్టల్. భూమి కోసం గొడవలు జరుగొద్దు అనుకుంటే ఏకైక పరిష్కారం ఒక్కటే. భూమి ఎవరిది? ఎక్కడిదాకా ఉన్నది? అనే రికార్డు స్పష్టంగా, స్ఫటిక సదృశ్యంగా ఉండాలి. ఇప్పుడు ధరణి చేసింది ఇదే. రైతులకు ఎవరి భూమి, ఎంత విస్తీర్ణం ఉన్నదనే రికార్డు ఆన్లైన్లో ఉన్నది. రైతు పొద్దున లేచిన తర్వాత ఒక క్లిక్తో ఆ సమాచారాన్ని చూసుకోవచ్చు. ఇదే లేకుంటే, తెలంగాణలో ఇప్పటి పరిస్థితులకు భూ పంచాయతీలు పెద్ద శాంతిభద్రతల సమస్యగా మారేవి.
మళ్లా పాత రోజులనాటి పరిస్థితే రావాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. అదే విషయమై పదే పదే ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే.. 60 ఏండ్ల కాంగ్రెస్ హయాంలో ఊరూరా లీడర్లు బతికింది పైరవీల మీదనే కాబట్టి. ‘ప్రజల మధ్య అనేక విషయాల్లో పంచాయతీలు పెట్టించాలి.. మళ్లీ పంచాయతీలు తెంపే స్థానంలో మనమే ఉండాలి. ప్రజలను దయనీయమైన దీనస్థితిలో ఉంచాలి, ఎప్పుడూ అవసరంలో ఉంచి, అంగలార్చే పరిస్థితికి తీసుకురావాలి.. అప్పుడే మన దగ్గరికి వస్తారు. అప్పుడే మనం ఊర్లల్ల రాజకీయం చేగలుగుతం. ఏదో చేశామని చెప్పి ఓటేయించుకోగలుగుతాం’ అనేది అప్పటి కాంగ్రెస్ నేతల అప్రకటిత పాలసీగా ఉందనేది బహిరంగ రహస్యం. అందుకే తెలంగాణను నాటి చీకటి రోజుల్లోకి తీసుకుపోదామని వారనుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ‘పాత చీకటి రోజులను సృష్టిస్తేనే కాంగ్రెస్కు లాభం. వాళ్లు ఈ తరహా రాజకీయానికి మాత్రమే అలవాటు పడ్డారు. రికార్డులు స్పష్టంగా ఉండటం, రైతుకు అందుబాటులో ఉంచడం అందుకే వాళ్లకు నచ్చడం లేదు’ అని విమర్శిస్తున్నారు.
ఉదాహరణకు ధరణి పోర్టల్ను తీసేస్తే ఏం జరుగుతుంది?. ఒక రైతుకు బీమా పరిహారం దక్కాలంటే.. ముందుగా పంచాయితీ నుంచో, మున్సిపాలిటీ నుంచో డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ‘చనిపోయిన వ్యక్తి రైతు’ అని ధృవీకరించే పత్రాలు దానికి జోడించి ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్రతినిధి వచ్చి వెరిఫికేషన్ చేయాల్సి వచ్చేది. మరణించిన వ్యక్తి నిజంగా రైతేనా? వారికి వ్యవసాయ భూమి ఉన్నదా? బీమా పరిహారం తీసుకోవడానికి అర్హులేనా? అని పరిశీలించేవారు. వారికి సహాయకంగా ఒక అధికారి ఉండేవారు.
బీమాసంస్థ ప్రతినిధి సేకరించిన వివరాలను సర్టిఫై చేసేవారు. అటు ఇన్సూరెన్స్ ప్రతినిధి, ఇటు సర్టిఫై చేసే అధికారి ఊరికే చేస్తారా?. ఏదో ఆశిస్తారు. వారికి తృణమో పణమో మృతుడి కుటుంబం సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిపోర్ట్ పైకి వెళ్తుంది. ఇలా అందరికీ ఇచ్చుకుంటూ పోతే రైతుకు మిగిలేది ఎంత? కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆపద్బంధు కింద రూ.50 వేలు ఇచ్చేవాళ్లు. దానికి సవాలక్ష కొర్రీలు. రైతు సంవత్సరీకం అయినంక కూడా డబ్బులు వచ్చేవి కాదు. ఒకవేళ వచ్చినా అల్లికి అల్లి సున్నకు సున్న అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఏమైంది? ప్రతి రైతు వివరాలు ఆన్లైన్లో రికార్డు అయ్యాయి. ఈ రికార్డు ప్రభుత్వంతోపాటు అటు ఎల్ఐసీ దగ్గర, ఇటు రైతుల దగ్గర కూడా ఉన్నది. రైతు ఎవరైనా మరణిస్తే.. ఆ వ్యక్తికి నిజంగా భూమి ఉన్నదో లేదో ధరణిలో చూస్తే తెలిసిపోతుంది. దీంతో వెంటనే టిక్ కొట్టి బీమా కోసం దరఖాస్తు చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్లోనే రైతు వివరాలను సరి చూసుకొని, బీమా మొత్తాన్ని అకౌంట్లో వేస్తున్నారు. ఇంతటి సౌలభ్యం రైతులకు అందకుండా పోవాలనేనా కాంగ్రెస్ వాళ్లు కోరుకుంటున్నది?
గతంలో ధాన్యం కొనుగోలు ఎట్లా ఉంటుండె? రైతు ఆరుగాలం కష్టించి పంటను పండించేవారు. వాటిని తూర్పారబట్టి, సొంతంగా ట్రాక్టర్ కిరాయికి తీసుకొని బీట్కు పోయేది. మార్కెట్లో కాంటా పెట్టేదాకా ఎదురుచూడాలె. అక్కడే పడుకోవాలె. కాంటా అయిపోయినంక ఒక చిట్టీ మీద రాసి ఇచ్చేవాళ్లు. ఈ చిట్టీకి ఎలాంటి సాధికారికత లేదు. అధికారిక రికార్డు కానే కాదు. ఈ చిట్టీ పట్టుకొని రైతులు డబ్బుల కోసం రోజులతరబడి మార్కెట్ యార్డు చుట్టూ తిరగాల్సి వస్తుండె. ఇప్పుడా పరిస్థితి లేదు. సొంత ఊరిలోనే కాంటా పెడుతున్నారు. దీంతో కొనుగోళ్లు వెంటవెంటనే పూర్తవుతున్నాయి. డబ్బు నేరుగా అకౌంట్లో పడుతున్నది. ఇది ఎలా సాధ్యమైంది? ధరణి వల్లనే కదా? రైతులకు సొంతూరిలోనే కలిగిన ఈ ప్రయోజనాన్ని కాలితో తన్నాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు భూ వివాదాలకు చరమగీతం పాడే దిశగా అడుగులు వేస్తున్నాయి. భూ రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయ్యి పక్కాగా రికార్డులు ఉన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతాయన్నది నిపుణుల మాట. రికార్డులు పక్కాగా ఉంటేనే పరిశ్రమల స్థాపనకు వ్యాపారవేత్తలు ముందుకు వస్తారు. సెజ్లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటవుతాయి. అమెరికా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఎప్పటినుంచో భూ రికార్డులన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి. ధరణి పోర్టల్ తరహా వ్యవస్థల ద్వారానే ఆపరేట్ అవుతున్నాయి. చివరికి కెన్యా వంటి పేద దేశం కూడా 2012 నుంచే ఆన్లైన్ భూరికార్డుల బాట పట్టింది. పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్థాన్ కూడా 2021 సెప్టెంబర్ నుంచి భూమి రికార్డుల డిజిటలైజేషన్ను దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది.
ధరణి లేకపోతే గ్రామాల్లో భూ వివాదాలు పెరగడమే కాదు.. అవి మాటలతో ఆగిపోవు. రైతుల మధ్య, కుటుంబాల మధ్య ఘర్షణలు మొదలై, నేరాల వరకు వెళ్తాయి. గతంలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం సివిల్ కోర్టుల్లోని కేసుల్లో 66 శాతం భూ వివాదాలవే. దేశంలో జరుగుతున్న హత్యల్లో 14 శాతం.. అంటే ప్రతి వంద హత్యల్లో 14 భూ తగాదాల వల్లే జరుగుతున్నట్టు నివేదిక స్పష్టంచేసింది. రికార్డులు సరిగ్గా లేక రైతుబంధు, రైతుబీమా, పంటకొనుగోళ్లు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను రైతులు కోల్పోతున్నారని, ఇలా సగటున ఎకరంపై సంవత్సరానికి రూ.50వేల వరకు నష్టపోతున్నారని వివరించింది. మరోవైపు భూ తగాదాల వల్ల జాతీయ వృద్ధిరేటు 1.3 శాతం తగ్గుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. వీటన్నింటికీ పరిష్కారంగా కేసీఆర్ ప్రభుత్వం ధరణిని తీసుకొస్తే.. ప్రతిపక్షాలు మాత్రం దానిని తీసేస్తామంటూ బీరాలు పలుకుతున్నాయి. గతకాలపు చీకట్లలోకి రైతుల్ని తీసుకెళ్లి, దళారులకు వారిని బలిపెట్టాలని చూస్తున్నాయి.
హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన ఆకుల నారాయణకు నలుగురు కొడుకులు, ఒక బిడ్డ. వీరికి నాలుగెకరాల 28 గుంటల వ్యవసాయ భూమి ఉంది. నారాయణ పిల్లల పెండ్లిళ్లు చేసిండు. ఎవరి ఎకరం వారికి ఇద్దామని ఎన్నో ఏండ్ల సంది అనుకున్నడు. కానీ కాంగ్రెస్ పాలనలో రిజిస్ట్రేషన్ చేసుకోవడమంటే మామూలు విషయం కాదు. డబ్బు కర్చుపెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి బ్రోకర్లను అర్సుకోనిదే పని అయ్యేది కాదు. పైగా ఎన్ని నెలలు పడుతదో తెల్వకపోయేది. ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని తెచ్చిన తర్వాత మండలంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నరని తెలిసి సంబురపడ్డాడు. వెంటనే కొడుకులకు కబురు పెట్టిండు. ఈ నెల 27న శనివారం నలుగురు కొడుకులు వంశీకృష్ణ, శ్రీనివాస్, నాగేందర్, రవికుమార్, బిడ్డ రజిత ఇంటికి వచ్చారు. ఒక్కో కొడుక్కు ఎకరం చొప్పున.. బిడ్డకు 28 గుంటల భూమిని ఒక్కరోజులోనే నారాయణ రిజిస్ట్రేషన్ చేయించాడు.
‘మేము పనుల రీత్యా వేరువేరు చోట్ల ఉంటున్నం. మా బాపు ఎప్పుడు రిజిస్ట్రేషన్ జోలి తీసినా వాయిదా వేసేటోళ్లం. కానీ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. నెలలో పోస్ట్లో పాస్బుక్ వస్తుందని చెప్పిన తర్వాత మాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలా నాకే కాదు చాలామందికి ధరణి వల్ల నమ్మకం కుదిరింది. రూపాయి ఖర్చు కాలేదు. కేసీఆర్ తెచ్చిన పోర్టల్ వల్లే మా బాపు కోరిక తీరింది.’ అని పెద్దకొడుకు నాగేందర్ ఆనందం వ్యక్తంచేశారు.
రైతులకు ఎంతో మేలు చేస్తున్న ధరణిని రైతులనుంచి దూరం చేయొద్దు. ఎక్కడో కొన్ని చోట్ల జరిగిన పొరపాట్లను సాకుగా చూపి మొత్తం ధరణి విధానాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టడం సరికాదు. ధరణి రాకముందు భూ ములు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే ఎన్ని తిప్పలో.. నాడు రోజంతా పడిగాపులు పడితే తప్పా రిజిస్ట్రేషన్లు అయ్యేవి కావు. చేతికి పాస్పుస్తకాలు అందాలన్నా అమ్యామ్యాలు ముట్టజెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ నేడు క్షణాల్లో రిజిస్ట్రేషన్లు కావడంతో పాటు ఇంటి వద్దకే పాస్ పుస్తకాలు వస్తున్నాయి. రైతులకు కష్టాలు ఉండొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారు. ఆయన రైతు బాంధవుడు.
– కుమ్మరి వెంకటేశ్, రైతు, జాజాపూర్, నారాయణపేట జిల్లా
కేసీఆర్ సార్ ధరణి తీసుకరాకపోతే మాకు భూమి లేక పోతుండె, రైతు బీమా రాక పోతుండె. మా ఆయన భూమి జాడ కోసం ఎంతో కష్టపడ్డడు. కానీ ధరణి అచ్చినంకనే ఆ భూమి దొరికింది. ఆ భూమి దొర్కవట్టే మా ఆయన కాలం చేసినంక మాకు రైతు బీమా కింద 5 లక్షల సాయం అందింది. ఇప్పుడు నా పేరు మీదకు భూమి బదలాయించుకున్నా. ఇప్పుడు నాకు రైతుబంధు సుక అస్తున్నది. ధరణే లేకుంటే మా భూమి దొరికేది గాదు. ఆ భూమే దొర్కకుంటే బీమానే వచ్చేది కాదు. గింత మంచి ధరణిని కొంతమంది ఇప్పుడు రద్దుచేయాలని అంటున్నరు. మాలాంటి రైతులను మళ్లీ ఇబ్బందికి గురిచేయొద్దు.
-అక్తర్ బేగం, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా
రైతులను మళ్లీ ఇబ్బందులు పెట్టేందుకే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. అందుకే ధరణి పోర్టల్పై అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టాయి. ఈ పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పారదర్శకమైన, వైగవంతమైన సేవలు అందిస్తుండడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. ఎందుకంటే ధరణి పోర్టల్ ద్వారా సేవలు పొందుతున్న రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం అన్నదాతల సంతోషాన్ని చూడలేకపోతున్నాయి. ధరణి పోర్టల్ వచ్చాక మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవుతున్నాయి. జిల్లా కేంద్రానికి వెళ్లే దూరం, సమయాభావం చాలా తగ్గింది. ఇంతటి ప్రాధాన్యమున్న ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించడం దారుణం. రైతులందరూ ఏకమై ఆ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం.
– వంకాయలపాటి సత్యనారాయణ, నాగులవంచ, చింతకాని, ఖమ్మం జిల్లా
రైతులు తమ భూసమస్యల పరిష్కారం కోసం తరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాలన్నదే కాంగ్రెస్ కుట్ర. ఇందుకోసమే ధరణి పోర్టల్పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నది. మా లాంటి ఏజెన్సీ మండలాల్లోనూ ఆన్లైన్ ద్వారా నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాల ప్రక్రియలు పూర్తవుతున్నాయి. ఆ వెం టనే ఆన్లైన్ హ క్కుపత్రాలు చేతికందుతున్నాయి. ఇదంతా ధరణి వల్లనే సాధ్యమవుతున్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నది. తరతరాలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలని కాంగ్రెస్ చూస్తున్నది. పూర్తి భద్రత, పారదర్శకతతో కూడిన ఆన్లైన్ విధానం ఆ పార్టీకి నచ్చడం లేదు. ధరణి విధానంతో బీఆర్ఎస్ను రైతులందరూ ఆదరిస్తున్నారు.
– మందా మోహన్రావు, రైతు, దుమ్ముగూడెం మండలం, భద్రాద్రి జిల్లా
నేను మా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 22 గుంటల భూమిని కొనుగోలు చేసిన. ఒకరోజు ముందుగా ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నా. ఈ రోజు రిజిస్ట్రేషన్ అయ్యింది. 20 నిమిషాల సమయంలో నా పేరుపై భూమి రిజిస్ట్రేషన్ అయిపోయింది. పట్టాదారు పాస్బుక్ ఆన్లైన్ ద్వారా ప్రింట్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేటోళ్లం. అక్కడ మధ్యవర్తులకు పైసలు ఇస్తే తప్ప పని అయ్యేది కాదు. భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా పాసు బుక్కు రావాలంటే నెలలు గడిచేది. ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనయ్యేదే కాదు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు ధరణిని రద్దు చేస్తామంటున్నరు. అంటే మళ్లీ పైరవీకార్లకు గేట్లు తెరువాల్నా? రైతుల కష్టాలు గుర్తించిన సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చి ఎక్కడి మండలాల్లో అక్కడే రైతుల భూముల రిజిస్ట్రేషన్లు అయ్యేలా సదుపాయం కల్పించడం సంతోషకరం.
-సిద్ధాపురం రామకృష్ణ, ముద్దెంగూడ, షాబాద్ మండలం, రంగారెడ్డి
ఇదివరకు భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్ట్రార్ ఆఫీస్లో పని అయ్యాక మళ్లీ మ్యుటేషన్ కోసం తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లే వాళ్లం. ఎన్నో రోజులు వీఆర్వో చుట్టూ తిరగాల్సి వచ్చేది. వీఆర్వోకు రిజిస్ట్రేషన్ కాగితాలు ఇస్తే నెలల తరబడి తిరిగితే పట్టాకు రాసేవాళ్లు. పాసు పుస్తకాల్లో పెన్నులతో ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్లు. ఒకరి భూమిని మరొకరికి రాసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. తాసిల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ అయితున్నది. అయిన వెంటనే మన పాస్బుక్కులో రిజిస్ట్రేషన్ అయిన భూమిని ప్రింట్ చేసి ఇస్తున్నారు. ఎవ్వరు కూడా డబ్బులు అడగడం లేదు. కొత్త పాసు పుస్తకాలను ఈ ప్రభుత్వం అందజేసింది. భూమి మొత్తం డిజిటలైజేషన్ అవుతుంది. మన వేలిముద్ర, సంతకం చేస్తే తప్ప భూమి పట్టా మారే ప్రసక్తి లేదు. ధరణితో భూ సమస్యలు చాలా వరకు తగ్గినయ్. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ధరణిని రద్దు చేయాలని దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నరు. అలాచేస్తే మళ్లీ రైతులకు బాధలు తప్పయ్.
– గుడికందుల వేణు, రైతు, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా