నవీపేట, ఆగస్టు 2: సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటిరంగానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. తలాపున గోదావరి ఉన్నా బీడువారిన భూములకు ఎత్తిపోతల ద్వారా జీవం పోస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా నిజామాబాద్ జిల్లాలో మరో ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నవీపేట మండలంలో బినోలా ఎత్తిపోతల పథకానికి బుధవారం రూ.79.89 కోట్లు మంజూరు చేసింది.
ఈ లిఫ్ట్ పూర్తయితే బినోలతోపాటు నందిపేట మండలం కంఠం, మాక్లూర్లోని కొత్తపల్లి, చిక్లీ తదితర గ్రామాల పరిధిలోని 700 ఎకరాలకు సాగనీరు అందనున్నది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న లిఫ్ట్ మంజూరు కావడంతో బినోల గ్రామ రైతులు సంబురాల్లో మునిగిపోయారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.