ములకలపల్లి, మార్చి 5: నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫర్టిలైజర్స్ ఎదుట పురుగు మందు డబ్బాలతో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గ్రామానికి చెందిన 20 మంది రైతులు 40 ఎకరాల్లో యాసంగి వరి సాగు కోసం బాలాజీ ఫర్టిలైజర్స్లో నాగార్జున సీడ్స్ వారి హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్ వరి విత్తనాలు కొనుగోలు చేశారు. వాటిని సాగు కోసం వినియోగించగా.. వయసు రాకముందే ఈనింది.
ఇప్పుడు పొలం అంతా తాలు కంకులు వేసింది. దీంతో నష్టపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని పురుగు మందు డబ్బాలతో దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు పేర్కొన్నారు. పది రోజుల క్రితం బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించుకున్నా.. నష్టపోయిన పంటలను, రైతులను కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది. సంబంధిత అధికారులు స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని రైతులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.