Congress | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): తాము అధికారంలోకి వస్తే పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడా సంగతిని మర్చిపోయింది. బోనస్ సంగతి దేవుడెరుగు.. పంటలకు మద్దతు ధర కల్పించేందుకే వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు నానా అవస్థలు పడుతున్నారు. ఇందుకోసం కేంద్ర సంస్థలకు లేఖలు రాస్తున్నారు. ఎప్పుడు ఏర్పాటవుతుందో తెలియని పసుపు బోర్డు కోసం, పత్తికొనుగోలు కేంద్రాల కొనసాగింపు కోరుతూ కేంద్రానికి లేఖలు రాశారు.
ఈ రెండింటి వల్ల రైతులకు ఇప్పటికిప్పుడు లభించే ప్రయోజనం ఏమీ ఉండదు. అయినప్పటికీ తన లేఖలతో రైతులకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఒకటిరెండు పంటలను కొనుగోలు చేసి మిగతా పంటలకు గిట్టబాటు ధర అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఫలితంగా రాష్ట్రంలో సాగు రెండుమూడు పంటలకే పరిమితమైందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. ఇప్పుడా పరిస్థితిని తప్పించేందుకు కేంద్ర సంస్థలకు లేఖలు రాసినట్టు వివరించారు.
పండించిన పంటలు అమ్ముకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పత్తి, పసుపు, మిర్చి, వేరుశనగ రైతులు కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొన్ని పంటలకు మద్దతు ధర లేకపోగా, మరికొన్నింటికి దక్కినా అధికారులు, వ్యాపారుల నుంచి ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. కేసముద్రం, మహబూబాబాద్ మార్కెట్లో మిర్చి పంటను కొనుగోలు చేయకుండా అధికారులు, వ్యాపారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
వేరుశనగకు గిట్టుబాట ధర కల్పించాలంటూ అచ్చంపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో రైతులు రొడ్డెక్కి ఆందోళన చేశారు. పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆదిలాబాద్లో రైతులు ఆందోళన చేశారు. పత్తికి మద్దతు ధర చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల తమ పంటలను అమ్ముకునేందుకు రైతులు ఆందోళనలు, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటనలు గుప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మద్దతు ధరపై వరికి క్వింటాలుకు అదనంగా రూ. 500 బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుక మడతేసింది. ధాన్యానికి ప్రస్తుతం మద్దతు ధరకంటే అధికంగా లభిస్తున్నదని, కాబట్టి బోనస్ ఇవ్వాల్సిన పనిలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఇటీవల చెప్పారు. ఇప్పుడు వ్యవసాయమంత్రి కూడా మద్దతు ధర కోసం కేంద్ర సంస్థలకు లేఖలు రాస్తుండడం విమర్శలకు తావిచ్చింది.