నిజామాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెక్కాడితే కానీ డొక్కాడని దళిత కుటుంబం వారిది. భార్యాభర్తలు కలిసి పని చేస్తేనే వారికి బతుకుదెరువు. కూలీనాలీ చేసుకుంటూ ఉన్న ఒక్క బిడ్డను కష్టం రాకుండా సాదుకున్నరు. బిడ్డ కండ్లముందే ఉండాలని ఇల్లరికం అల్లుడిని చేసుకున్నరు. ఇంకెన్నాళ్లీ కైకిలి బతుకు.. అని ఉన్న రెండెకరాలను సాగు చేయాలనుకున్నరు. ఇదే విషయాన్ని రైతు దుర్గయ్య, భార్య శోభతో పంచుకున్నాడు. సాగుకు వానకాలం ఢోకా లేకపోయినా.. యాసంగికి నీళ్ల కరువు ఉంటదని గుర్తించిండ్రు. నీళ్ల కరువు తీరడానికి పొలంలో బోరు వేద్దామని నిర్ణయించుకుని, తెలిసిన వారి వద్ద అప్పు చేసి ఒక బోరు వేయించాడు. చుక్క నీరు రాలేదు. అయినా సాగుపై ఆశ చావలేదు. నీళ్లు ఎలాగైనా పడుతాయనే ఆశతో మరో బోరు వేశాడు. మళ్లీ అదే పరిస్థితి. మూడో ప్రయత్నం కూడా విఫలమైంది. అయినా ధైర్యం చేసి నాలుగో బోరు వేశాడు. ఈ సారీ బోరులో నీళ్లు రాలేదు. కానీ రైతు కంట కన్నీరు ఆగలేదు. వందలాది ఫీట్లు బోరు తవ్వినా పొలం గట్లపై మట్టి దుబ్బలే మిగిలాయి. మరో వైపు అప్పులు కుప్పగా మారాయి. సాగు ఆశలన్నీ చెదిరిపోవడంతో ఆ దళితరైతు పొలం పక్కనే చెట్టుకు ఉరేసుకున్నాడు. తడారి నోళ్లు తెరిచిన పొలాల మధ్యే తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన దళిత రైతు దుర్గయ్య కుటుంబ దుర్భర పరిస్థితి ఇది.
మట్టి దుబ్బనే సాక్ష్యం
దుర్గయ్య కుటుంబ దుస్థితికి పొలంలో బోర్లు వేసిన తర్వాత మిగిలిన మట్టి దుబ్బనే సాక్ష్యంగా నిలిచింది. నెర్రెలు బారిన నేల మధ్యలో ఫెయిలైన బోర్లను చూసి దుర్గయ్య భార్య శోభ ఎక్కెక్కి ఏడుస్తున్నది. బోర్లు వేసే సంసారం బోర్లబొక్కపడ్డదని బరువెక్కిన హృదయంతో తెలిపింది. కండ్లముందే బిడ్డ ఉండాలని కోరుకున్న బాపు.. కానరాకుండా పోయిండని ఒక్కగానొక్క కుమార్తె పూజ బోరుమన్నది. తండ్రిని పోగొట్టుకున్న బాధలో కూతురు గుండెలవిసేలా రోదిస్తున్నది. అప్పటివరకు ఉన్నకాడికి సర్దుకున్న ఆ కుటుంబం ఒక్కసారిగా డీలా పడింది. ఇంటి పెద్దను కోల్పోయిన బాధ ఒక వైపు, బోరు వేసేందుకు చేసిన అప్పు మరోవైపు ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నది. నాలుగు బోర్లు వేయిస్తే.. నాలుగైదు లక్షలపైనే ఖర్చు వచ్చినట్టు భార్య శోభ తెలిపింది.
నీళ్లు పడితే దర్జాగా బతుకొచ్చని అనుకున్నామని, దుర్గయ్య మరణంతో దుర్భర బతుకు అయ్యిందని శోభ రోదిస్తూ చెప్పింది. ఎవుసానికైన అప్పులు, దిగుబడి నష్టాలు కాలసర్పల్లా కాళ్లకు చుట్టుకుని ఆత్మహత్యలకు తెగబడాల్సిన దురావస్థ మరే రైతుకూ రాకూడదని వారంతా వేడుకుంటున్నారు. జనవరి 28, 2024న దుర్గయ్య చనిపోతే ఇంతవరకు రైతుబీమా చెక్కు అందలేదని మృతుడి భార్య శోభ ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారు షబ్బీర్ అలీ సొంత నియోజకవర్గంలో ఓ దళిత రైతు చనిపోతే ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. అట్టడుగు వర్గాల సంక్షేమ కోసం ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి కూడా సహకారం చేయలేకపోవడంపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. రైతుబీమా కోసం మొదట్లో వివరాలు తీసుకున్న వారికి కాల్ చేస్తే మాటిమాటికి ఫోన్ చేయొద్దని దబాయిస్తున్నారని రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆదుకోండి సారూ..
మాది చాలా పేద కుటుంబం. కూలీనాలీ చేసుకునేటోళ్లం. 2 ఎకరాల పొలంలో బోర్లు వేసుకుని సాగు చేసుకుందామనుకున్నం. నాలుగు బోర్లు ఫెయిల్ వేసినా అయినయ్. కాలం కలిసి రాలేదు. బోర్ల కోసం చేసిన అప్పులు మెడ మీదున్నయి. అప్పులు కట్టలేకనే నా భర్త జీవి ఇడిసిండు. ఇప్పుడు మేమెట్ల బతకాలి. అప్పులెట్ల తీర్చాలి. ప్రభుత్వం మమ్ముల్ని ఆదుకుంటేనే మాకు బతుకుదెరువు. దండెం పెట్టి అడుగుతున్న ఆదుకోండి సారూ.
– శోభ, దుర్గయ్య భార్య