బెజ్జంకి/వీణవంక, మే 19 : అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చీలాపూర్పల్లికు చెందిన గొట్టి బాలయ్య(50) తనకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి, పత్తి సాగు చేయడంతోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి సాగుచేశాడు. దిగుబడి సరిగా రాక అప్పుల పాలయ్యాడు. దీనికితోడు తల్లి నర్సవ్వ అనారోగ్యానికి గురికాగా వైద్య ఖర్చుల కోసం సుమారుగా రూ.10 లక్షలు వరకు అప్పులయ్యాయి. ఆ అప్పులెలా తీర్చాలో తెలియక తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం పొలం వద్దకు వెళ్లి చింతచెట్టుకు ఉరివేసుకొన్నాడు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల సదానందం (40) నాలుగేండ్లుగా రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటం.. సాగుకోసం తెచ్చిన అప్పులు ఏటా పెరుగుతుండటంతో కలత చెందాడు. సుమారు రూ.8లక్షల వరకు అప్పు ఉండటంతో ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. చుట్టు పక్కల వారు గమనించి వెంటనే 108 వాహనంలో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.