మిర్యాలగూడ, మార్చి 20 : నీళ్లియ్యరు.. పంటలను కాపాడరు? ఇదేమి సర్కార్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో ఎండిపోయిన పంట పొలాలను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, రైతులతో కలిసి జగదీశ్రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కండ్ల ముందు పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు తాగునీటి పేరుతో పంట పొలాలకు సాగునీరు ఇచ్చి లక్షలాది ఎకరాలను కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు ఎస్ఎల్బీసీ, ఎడమ కాల్వ చివరి భూములకు కూడా నీరందించినట్టు చెప్పారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొ దటి పొలానికి కూడా నీరు అందని పరిస్థితి నెలకొన్నదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ లేదని.. ఒకవేళ ఉంటే నీరు ఇచ్చి ఆదుకునేవారని తెలిపారు. కనీసం రెండు తడులకైనా నీరందిస్తే పంటలు చేతికొచ్చేవని పేర్కొన్నారు.
పంటలు పండితే రైతులకు రూ.500 ఇవ్వాల్సి వస్తుందనే సాకుతోనే నీరు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని, కనీసం జిల్లా మంత్రులకు కూడా సోయి లేకుండా పోయిందని విమర్శించారు. గుళ్లు, గోపురాలు తిరగడం మంచిదే కానీ, పక్కనే ఎండిపోతున్న పంట పొలాలను కూడా పరిశీలిస్తే బాగుండేదని సూచించారు. పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం కానీ, జిల్లా మంత్రులు కానీ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
డబ్బులు ఢిల్లీకి పంపడమే తెలుసు
ఈ ప్రభుత్వానికి, మంత్రులకు ఇసుకదం దా చేయడం, డబ్బులు వసూలు చేయడం, ఢిల్లీకి పంపడం మాత్రమే తెలుసని జగ దీశ్రెడ్డిఎద్దేవా చేశారు. ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు ద్రోహం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకునేందుకు జిల్లా స్థా యిలో సమీక్ష జరిపి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఆ గ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యు డు మోసిన్అలీ తదితరలు ఉన్నారు.