రైతులను ఆదుకోవాల్సింది కేంద్రమే.. కేసీఆర్ ఆందోళనలకు మద్దతిస్తాం
దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలి
దేశమంతటా ఒకే తీరు ధాన్యం సేకరణ ఉండాలి
రైతుబంధును అన్ని రాష్ర్టాలు అమలు చేయాలి
‘నమస్తే తెలంగాణ’తో రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదని ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు. ఎఫ్సీఐ ధాన్యం కొనటం లేదని తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో నిరసన బాట పట్టారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తున్నదని వ్యాఖ్యానించారు. రైతు సమస్యల పరిష్కారంలో కేంద్రం ఆది నుంచీ నాన్చుడు, నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు. ఆదివారం ఆయన నోయిడాలో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఒక దేశం.. ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న డిమాండ్పై మీ స్పందనేమిటి?
కేసీఆర్ చేస్తున్న డిమాండ్ సముచితమైంది. దేశమంతా ఒకటే అన్నప్పుడు, ఒకే విధమైన ప్రొక్యూర్మెంట్ విధానం ఉండాలి. రైతులు పండించే పంటలను కొనాల్సిన బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదే. తెలంగాణ రైతులు కూడా భారతదేశ రైతులే అన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలి. కేంద్రం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదు. రాష్ట్రానికో విధానమెందుకు? కేసీఆర్ చేస్తున్న డిమాండ్కే నా మద్దతు. కేంద్రం ధాన్యం కొనకపోతే.. ఆ తేడా మొత్తం ఏముంటుందో అది రైతులకు ఇవ్వాలి. రైతు దేశం కోసం ఉత్పత్తి చేస్తాడు. రైతును ఆదుకోవడం కేంద్రం బాధ్యత.
తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో చేపట్టే దీక్షకు మద్దతిస్తారా?
వందకు వంద శాతం తెలంగాణ రైతుల పక్షాన మేం కూడా ఉంటాం, మద్దతిస్తాం. దేశంలో ఏ రైతుకు ఇబ్బం ది వచ్చినా నిల్చుంటామని ఎప్పుడో చెప్పాం. ఇప్పుడూ అదే చెప్తున్నాం. సోమవారం జరిగే నిరసన దీక్షలో నేను, సహచర రైతు ఉద్యమ నాయకులు పాల్గొంటాం. ఇంకో ఆలోచనే లేదు. భవిష్యత్తులోనూ కేసీఆర్ రైతుల కోసం ఎలాంటి ఉద్యమం చేసినా మా మద్దతు ఉంటుంది. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తున్నారంటే అది రైతుల పక్షాన చేస్తున్నట్టే. కేసీఆర్ కూడా ఒక రైతే.
నల్ల చట్టాల రద్దుపై చేపట్టిన ఉద్యమం విజయవంతమైంది. మీ తదుపరి కార్యాచరణ ఏమిటి?
కేంద్రం రైతు మెడపై కత్తిపెట్టే చట్టాలు తేకుండా అడ్డుకోగలిగాం. కానీ, దేశ రైతాంగం అనేక సమస్యలను ఎదురొంటున్నది. మా ఉద్యమం ఆగిపోలేదు. ఎకడికకడ రైతుల సమస్యలను గుర్తించి పోరాటం చేస్తాం. కనీస మద్దతు ధరపై జాతీయ స్థాయిలో ఒక చట్టం రావాలని కోరుతున్నాం. దీనికోసం ఒక కమిటీని వేస్తామని కేంద్రం చెప్పింది. కానీ, ఇప్పటి వరకు కమిటీ పనితీరు ఎలా ఉంటుంది? ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? అధ్యక్షులుగా ఎవరుంటారు? విధివిధానాలు ఏమిటన్నది ఇంకా చెప్పలేదు. రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో జరిగే రైతులు, రైతు సంఘాల సమావేశాలకు వెళ్తాం. తెలంగాణలోనూ ఒక సమావేశం నిర్వహించాలన్న ఆలోచన ఉన్నది.
అమర రైతులకు నష్టపరిహారం అందించే విషయం ఎక్కడి వరకు వచ్చింది?
నల్ల చట్టాల రద్దు కోరుతూ అసువులు బాసిన రైతు కుటుంబాలకు 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇవ్వాలని కోరాం. కేంద్రం నుంచి స్పం దన లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో రైతు కుటుంబానికి రూ.3 లక్షలు ప్రకటించింది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. ఒకట్రెండు రాష్ట్రాలు కూడా స్పందించాయి. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్ ఇవ్వలేదు.
డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం వ్యవసాయ రంగంపై ఉంటుందని భావిస్తున్నారా?
కచ్చితంగా ఉంటుంది. నాగలితో దున్నినా ఈ భారం రైతుపై పరోక్షంగానైనా పడుతుంది. దేశంలోని అన్ని రంగాలపై పెట్రోధరల పెంపు భారం ఉన్నట్టే, వ్యవసాయ రంగంపైనా పడింది. ఎన్నికల సమయంలో తగ్గే పెట్రో ధరలు ఎన్నికలు ముగిశాక ఎలా పెరుగుతాయన్నది పెద్ద ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను తగ్గించాల్సిందే.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ఇస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేకపోవడంపై ఏమంటారు?
రైతులందరికీ 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్కు నా అభినందనలు. దేశవ్యాప్తంగా రైతులందరికీ నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించాలి. దీనివల్ల రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. కానీ, కేంద్రం తెచ్చే విద్యుత్తు సంస్కరణలు రైతులకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉన్నది. ఈ తరహా చట్టాలు మంచివి కావు. కొత్త చట్టాలు తీసుకొస్తే రైతులకు నష్టం. కరెంటు చార్జీలు పెరుగుతాయి. ఇక, రైతులకు పెట్టుబడి సాయం అందాలి. తెలంగాణ ఇస్తున్న రైతుబంధు తరహా పథకాన్ని అన్ని రాష్ర్టాలు అమలు చేయాలి. కేంద్రం కూడా దీనిపై స్పందించాలి. ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇవ్వాలి. రైతులకు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి.