న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఏ మూలనా రైతులు సంతోషంగా లేరని, ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకుడు రాకేశ్ టికాయిత్ అన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రంపై తెలంగాణ రైతులు చేస్తున్న పోరాటానికి (ఎస్కేఎం) సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ప్రకటించారు. రైతులు, ఆదివాసీల సమస్యల గురించి ఎవరు మాట్లాడినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో సోమవారం నిర్వహించిన రైతు దీక్షలో రాకేష్ టికాయిత్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్ష పూర్తిగా రైతుల ఆందోళన అని, రాజకీయ వేదిక కాదని తెలిపారు. సీఎం కేసీఆర్తోపాటు దీక్షలో పాల్గొన్నవారంతా రైతులేనని చెప్పారు.
తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవాలని అన్నారు. ‘ఢిల్లీలో ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారానికి ఇకడికి రాలేదు. ఓట్లేమీ అడగటంలేదు. కేవలం రైతు సమస్యల పరిషారం కోసమే ఇకడ ఆందోళన జరుగుతున్నది. సీఎం కేసీఆర్ది, తెలంగాణ ప్రభుత్వానిది రాజకీయ ఆరాటం కాదు. రైతుల కోసం పోరాటం. ఇలాంటి సీఎంను మేము స్వాగతిస్తాం. వారు నిర్వహించే వేదికలకు హాజరవుతాం.
బీహార్తోపాటు ఇతర దూరప్రాంత రాష్ర్టాల నుంచి కూడా ఇక్కడికి రైతులు వచ్చారు. ఢిల్లీ వరకు వచ్చి ఆందోళన చేస్తే తప్ప కేంద్రప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోదా? దేశంలో అసలు ఏం జరుగుతున్నది? రైతులు ఇలాగే బాధలు పడుతూనే ఉండాలా? ఆందోళన చేసేవారికి వ్యతిరేకంగా కేంద్రం చర్యలు తీసుకొంటున్నది. అధికారులు వచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులు, శ్రమజీవులు, ఆదివాసులు తమ గ్రామాల గురించి మాట్లాడితే ఈ దేశంలో నేరమా? సమస్యలపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయాలా? ఈ దేశపు రైతు ఎప్పుడూ బలహీనుడు కాదు.. కాబోడు. ఈ దేశపు రైతు పోరాడుతాడు. అది అతని హక్కు’ అని స్పష్టంచేశారు.
అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాల్సిందే
పంట ఉత్పత్తుల మద్దతు ధర (ఎంఎస్పీ)కు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని రాకేశ్ టికాయిత్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న 23 పంటలతోపాటు దేశంలో పండే అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఎంఎస్పీపై కమిటీ వేస్తామని చెప్పిన కేంద్రం, ఇప్పటికీ దాని విధివిధానాలు ప్రకటించలేదని ఆరోపించారు. రైతులను సంప్రదించకుండా రూపొందించిన నల్ల చట్టాలపై 13 నెలలపాటు పోరాడి దేశ రాజధానిని దిగ్బంధిస్తే కేంద్రం దిగివచ్చి వాటిని రద్దు చేసిందని, అయినప్పటికీ రైతుల సమస్యలు కేంద్రానికి అర్థం కాలేదని విమర్శించారు.
పోరాటం చేసిన రైతులను ఉగ్రవాదులు, రౌడీలుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే రైతులకు ఎకరానికి ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఏటా ఆరు వేలు.. అదికూడా మూడు విడతల్లో ఇస్తూ రైతులను మొత్తం బతికిస్తున్నట్టు ప్రచారం చేసుకొంటున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యత్తు ఇస్తున్న విషయాన్ని తాను అనేక సభల్లో ప్రస్తావించానని తెలిపారు.
విద్యుత్తు సంస్కరణలు రైతుకు గొడ్డలిపెట్టు
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సంసరణలు రైతులకు గొడ్డలిపెట్టులాంటివని రాకేశ్ టికాయిత్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ బిల్లు ప్రకారం రెండు పశువులున్న రైతు కమర్షియల్ విద్యుత్తు కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఇట్లాంటి విధానాలతో రైతులు బతకగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారని, రైతు మరణిస్తే బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారని ప్రశంసించారు. ‘రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఉన్నది.
నేను బయటకు వెళితే రాజకీయ వేదికపైకి వచ్చారని మీడియా ప్రశ్నిస్తున్నది. కానీ ఇది రాజకీయం కాదు. రైతుల గురించి మాట్లాడేవారందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తాం. రైతులంటే బలహీనులు అని కేంద్రం అనుకొంటున్నది. జాతీయస్థాయిలో రైతులంతా ఏకం కావాలి. కేసీఆర్ గారు మీరు రాజకీయ వ్యూహం రచించండి. మేం రైతులను సంఘటితం చేస్తాం. రైతుల కోసం దేశమంతా ఒక్కటి కావాలి’ అని పిలుపునిచ్చారు.