మెదక్ : అడవి పంది(Wild boar) దాడిలో ఓ రైతు మృతి(Farmer killed) చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్(Medak) జిల్లా చిలిపిచెడ్ మండలం అజ్జమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడి కొడుకు పోచయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు పన్నాల శంకరయ్య(59) రోజువారీగా తన పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అడవి పంది అతడిపై దాడి చేసింది.
ఈ ప్రమాదంలో శంకరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన అతడి కుమారుడు, స్థానికులు హుటా హుటిన నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శంకరయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.