జనగామ, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు బలయ్యాడు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం లక్షలాది రూపాయలు తీసుకొని పని చేయకపోగా.. డబ్బులు తిరిగి అడిగినందుకు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపంతో ఆ రైతు పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లాలో చోటుచేసుకున్నది. బంధువులు, గ్రామస్థులు బచ్చన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నాకు దిగారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. బచ్చన్నపేట మండలం పడమటి కేశ్వాపూర్కు చెందిన రైతు కొమ్మాటి రఘుపతి (45)కి గ్రామంలోని వ్యవసాయ బావి పకన ఉన్న ఎకరం 20 గుంటల భూమి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ కావడంతో దాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తానంటే అప్పు తెచ్చి మరీ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సుమన్, మండల సర్వేయర్ రవీందర్కు రూ.4.50 లక్షలు లంచంగా ముట్టజెప్పాడు. రెండేండ్ల క్రితం డబ్బులు తీసుకొని కూడా భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో విసిగిపోయిన బాధిత రైతు అప్పుగా తెచ్చి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రెవెన్యూ అధికారులను పలుమార్లు వేడుకున్నాడు. డబ్బులు ఇవ్వకపోగా వేధింపులకు పాల్పడి వ్యక్తిగతంగా బెదిరింపులకు దిగడం, అప్పు తీసుకొచ్చిన దగ్గర వడ్డీ, అసలు పెరిగి పోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన రఘుపతి శుక్రవారం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రఘుపతి మృతికి రెవెన్యూ అధికారులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున బచ్చన్నపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొన్నారు. అక్కడ రఘుపతి మృతదేహంతో బైఠాయించారు. రైతు ఆత్మహత్యకు కారకులైన సీనియర్ అసిస్టెంట్ సుమన్, మండల సర్వేయర్ రవీందర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని డబ్బులు తిరిగి ఇప్పించడంతోపాటు బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు హామీతో ఆందోళన విరమించారు.