హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆత్మహత్యలు, వలసలతో దారుణ పరిస్థితులు ఉన్న తెలంగాణను నిర్ణయాత్మక పద్ధతిలో ఒక దరికి తీసుకువచ్చామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. స్థిరమైన లక్ష్యంతో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసి, వ్యవసాయాన్ని స్థిరీకరించి, పల్లెలు చల్లగా ఉండేలా, వృత్తి పనివాళ్లందరికీ పనులు కల్పించాలని స్పష్టమైన పాలసీ తీసుకున్నామని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన అడుగులు వేసిందని చెప్పారు. వరిధాన్యాన్ని సేకరించేది లేదని కేంద్రం కరాఖండిగా చెప్పడం వల్లే ఈ యాసంగిలో వరి పంట కాకుండా వేరేది వేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారని కేసీఆర్ తెలిపారు. వరివేస్తే నష్టపోతామన్న కారణంతోనే వేయొద్దని చెప్పారని తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
వ్యవసాయాన్ని స్థిరీకరించాం
తెలంగాణ ఏర్పడేనాటికి కరువుతో రైతుల ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. పాలమూరు, నల్లగొండ, మెదక్ జిల్లాలు కరువు జిల్లాలుగా పేరుపడ్డాయి. ఆ జిల్లాల నుంచి రైతులు హైదరాబాద్కు వలసలు వచ్చే దారుణ పరిస్థితులుండేవి. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని చక్కగా తీర్చిదిద్దే అవకాశాన్ని ప్రజలు మాకు కట్టబెట్టారు. కాబట్టి.. స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మక పద్ధతిలో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసి, వ్యవసాయాన్ని స్థిరీకరించి, పల్లెలు చల్లగా ఉండేలా, వృత్తి పనివాళ్లందరికీ పనులు కల్పించాలని స్పష్టమైన పాలసీ తీసుకున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన అడుగులు వేసింది. మొదటగా అడుగంటిపోయిన భూగర్భ జలాలు పెంచడానికి శిథిలమై చిక్కిపోయిన చెరువులను మిషన్ కాకతీయ పేరుమీద అద్భుతంగా తీర్చిదిద్దాం. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియని స్థితిలో అస్తవ్యస్తంగా ఉన్న కరెంటును పూర్తిగా సంస్కరించి, అనేక పెట్టుబడులు పెట్టి మరే రాష్ట్రంలో లేనివిధంగా అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నాం.
నకిలీ విత్తనాలపై పీడీయాక్ట్ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాలు సరిగ్గా దొరికేవి కావు. విపరీతమైన కల్తీ విత్తనాలుండేవి. కేంద్రంతో కొన్ని నెలలపాటు కొట్లాడి, ఒప్పించి, కల్తీ విత్తనాలు అమ్మినవారిపై పీడీ యాక్ట్ను తెచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దీనిపై కేంద్రం మమ్మల్ని చాలా సతాయించింది. తెలంగాణ ఏర్పడక ముందు రైతాంగానికి ఎరువులు కావాలంటే రోజుల తరబడి లైన్లలో ఉండాల్సి వచ్చేది. ఆ రోజు 13-14 లక్షల టన్నులుంటేనే పోలీస్ స్టేషన్లలో ఎరువుల బస్తాలు పెట్టి అమ్మిన పరిస్థితులు కూడా చూసినం. ఆ రోజు మొత్తం వాడిన ఎరువులతో పోలిస్తే ఇప్పుడు మూడింతలు పెరిగింది. రెండు పంటలకు కలిపి 50-55 లక్షల టన్నుల ఎరువులు వాడుతున్నరు. మా ప్రభుత్వం వచ్చాక నాటి కేంద్రమంత్రిని ఒప్పించి ఎరువులకు డిమాండ్లేని వేసవిలో ఇవ్వండి అని కోరాం. వాటిని నిల్వ చేయడానికి గోదాములను ఆగమేఘాల మీద నిర్మించాం. మంచి విత్తనాలు అందుబాటులో ఉంచాం. భూగర్భ జలాలు పెంచుకున్నం. 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నం. పెట్టుబడికి రైతుబంధు ఇస్తున్నం. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతుబీమా ఇవ్వడం లాంటి చర్యల వల్ల అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. కరోనా విపత్కర పరిస్థితిలో రైతులను ఆదుకొనేందుకు దాదాపు ఆరువేల కొనుగోలు కేంద్రాలు తెరిచి, నెలల తరబడి ధాన్యాన్ని సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతులను కడుపులో పెట్టుకొని కాచుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అది. ఇదంతా ప్రజలకు తెలుసు. ఏడేండ్ల కింద ఎట్ల ఉండె, ఇప్పుడెట్ల ఉండె.. అనేది ఏ రైతును అడిగినా చెప్తారు.
ఎల్ఐసీ చైర్మన్ మెచ్చుకున్నరు
రాష్ట్రంలో చిన్నకారు రైతాంగం 93% ఉన్నారు కాబట్టి ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని తెచ్చాం. పంటకు రూ.4 వేలతో ప్రారంభించి,
రూ.5 వేలకు పెంచి ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి ఇస్తున్నం. ఇలా ఇచ్చేది దేశంలో తెలంగాణ ఒక్కటే. రైతులు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకొనేందుకు రైతుబీమా తెచ్చాం. ఇది కూడా ‘యూనిక్ స్కీమ్ ఇన్ ద వరల్డ్’. ‘తెలంగాణ స్టేట్ ఈజ్ లార్జెస్ట్ కస్టమర్ ఆఫ్ ఎల్ఐసీ’ అని ఆ రోజే ఎల్ఐసీ చైర్మన్ చెప్పారు.
ప్రజల జీవితాలతో చెలగాటమాడితే ఊర్కోను
తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఊర్కోడు కేసీఆర్. నన్నంటే నేను పడతా. రైతులను మోసం చేస్త, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తనంటే ఒప్పుకోను. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, ఆర్థిక క్రమశిక్షణ పాటించినం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంది. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నాం. ఇది మా క్రమశిక్షణకు నిదర్శనం. మీ చేతకానితనం వల్ల దేశాన్ని నాశనం పట్టిచ్చింది మీరు. 70-80 లక్షల కోట్ల అప్పులు చేసింది కేంద్రం. జీడీపీని క్రాష్ చేసిన్రు, ధరలు పెంచిన్రు. ప్రతి ఒక్క వస్తువు ధర భగ్గుమంటున్నది. పెరగంది ఏదన్నా ఉన్నదా? పేదల జేబులు దోపిడీ చేస్తున్నరు. వాస్తవాలు ఇలా ఉంటే మా అంత గొప్పోళ్లు లేరనట్టు, మా అంత సిపాయిలు లేరన్నట్టు అడ్డం పొడుగు మాట్లాడుతున్నరు. ఇప్పటి దాకా క్షమించినం. ఇక క్షమించం.