హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు అద్భుతంగా ఉన్నాయని, రైతు అనుకూల పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఉమ్మడి ఏపీ వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశంసించారు. ఆదివారం మంత్రుల నివాసంలో ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో సమావేశమయ్యారు. వ్యవసాయ విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. మారిన పరిస్థితుల్లో పంటల వైవిధ్యీకరణ తప్పనిసరని, రైతులు వరి సాగు నుంచి పప్పు, నూనె గింజల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. తెలంగాణ సర్కారు ఆయిల్ పామ్ సాగుకు రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు. ఇథనాల్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహించాలని సూచించారు.
రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. మద్దతు ధరల విషయంలో లోపభూయిష్ట విధానాలతో కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. మద్దతు ధరలపై స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ఇందుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలుపుకొని వ్యవసాయం విషయంలో లోపాలను సరిదిద్ది, రైతులకు మరింత మేలు కలిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తాను లేవనెత్తిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి నిరంజన్రెడ్డిని కోరారు.