వీర్నపల్లి, మార్చి 30 : పొలానికి వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన రైతు జంగం అంజయ్య(60) ఆదివారం మధ్యాహ్నం వెంకట్రాయుని చెరువు సమీపంలో తన పంట పొలానికి వెళ్లాడు. ఒడ్లపై పెరిగిన గడ్డి కోసి కాళ్లు, చేతులు కడుక్కునేందుకు బోరు మోటర్ వద్ద కు వెళ్లాడు.
ప్రమాదవశాత్తు విద్యుత్తు వైరు తగిలి షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలందాకా వెళ్లొస్తానని చెప్పిన ఇంటి పెద్ద ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈయన సీపీఎం రైతు విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య పుష్పల, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.