సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 28: పొలం పనులు చేస్తుండగా గుండెపోటు వచ్చి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. తంగళ్లపల్లికి చెందిన ఒగ్గు మల్లేశం (55) రోజూ మాదిరిగానే తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అక్కడ పొలం పనులు చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలాడు.
స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు. అప్పటికే మల్లేశం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య పద్మ, ముగ్గురు కూతుళ్లు మౌనిక, సుశ్మిత, రశ్మిత ఉన్నారు. అయితే.. చిన్న కూతురు రశ్మిత ప్రేమ వేధింపులతో గతంలో ఆత్మహత్య చేసుకున్నది. మల్లేశం గొర్రెలు, మేకలు కూడా గతంలో పిడుగుపాటుతో మృత్యువాత పడ్డాయి.