జనగామ రూరల్, మార్చి 7: విద్యుత్తు షాక్తో యువ రైతు మృతి చెందిన ఘటన జనగామ మండలం పెద్దపహాడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కారె రవి (29) పొలానికి నీరు పెట్టడానికి ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రవి విగతజీవిగా పడి ఉండగా, గమనించిన కొందరు రైతులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకుని చూడగా స్టార్టర్ సమీపంలో 20 మీటర్ల దూరంలో పడి మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా రవి మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రవి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.