Tragedy | ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన అన్నదాత దుర్మరణం చెందాడు. ధాన్యానికి కాపలా పడుకున్న అతనిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పచ్చనూర్లో చోటుచేసుకుంది.
పచ్చనూర్కు చెందిన ఉప్పలేటి మొండయ్య (60) అనే రైతు తన ధాన్యాన్ని గ్రామంలోని ఐకేపీ సెంటర్కు తీసుకొచ్చాడు. ధాన్యానికి కాపలాగా శుక్రవారం రాత్రి అక్కడే నిద్రపోయాడు. నిద్రపోయే సమయంలో తనపై టార్పలిన్ కవర్ కప్పుకున్నాడు. అయితే తెల్లవారుజామున ధాన్యం లోడ్ను రైస్ మిల్లుకు తీసుకెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఇది గమనించలేదు. టార్పలిన్ కవరే కదా అన్నట్లుగా దానిపై నుంచి పోనిచ్చాడు. దీంతో మొండయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.