Andhrajyothi | మహబూబాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): గత మార్చిలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇవ్వలేదంటూ ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు కథనంపై రైతు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. కనీస వివరాలు కూడా తెలుసుకోకుండా ఓ తప్పుడు కథనాన్ని అల్లి ఆంధ్రజ్యోతి అచ్చేసిందని రైతులు మండిపడుతున్నారు. కథనం కోసం వాడుకొన్న ఫొటోలో ఉన్న రైతు సోమాకు ఇప్పటికే నష్టపరిహారం అందిన విషయం కూడా తెలుసుకోకుండా గుడ్డిగా వార్త జనంలోకి వదిలిందని ఎద్దేవా చేస్తున్నారు. ‘పరిహారమేది సారూ’ పేరుతో ఆంధ్రజ్యోతి మంగళవారం మొదటిపేజీలో ఓ వార్త ప్రచురించింది. ఈ వార్తకు రెడ్డికుంట తండాలో రైతు భుజంపై చేయి వేసి భరోసా ఇస్తున్న కేసీఆర్ ఫైల్ ఫొటోను వేసింది. ఆ ఫొటోలో ఉన్న రైతు పేరు సోమా. అతనికి పంట నష్టపరిహారం రూ.26 వేలు ఇప్పటికే అందటం గమనార్హం.
ప్రభుత్వంపై బురదజల్లేందుకే..
మహబూబాబాద్ జిల్లాలో ఈ ఏడాది మార్చిలో కురిసిన అకాల వర్షానికి పంట నష్టం జరిగింది. మొదటి విడతలో 14,549 మంది రైతులకు సంబంధించిన 11,673 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. మార్చి 23న సీఎం కేసీఆర్ పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో పర్యటించారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు 10 వేల పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. జిల్లాకు రూ.11.67 కోట్లు ప్రభుత్వం పరిహారం కింద విడుదల చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే, మార్చి 23న కేసీఆర్ రెడ్డికుంటతండాలో పర్యటిస్తే.. దంతాలపల్లికి వచ్చారని ఆంధ్రజ్యోతి పేర్కొన్నది. ఫొటోలో ఉన్న రైతు సోమతోపాటు అతని భార్య రామతార, కొడుకు శ్యామ్కుమార్కు కూడా ఇప్పటికే నష్టపరిహారం అందింది. ఇదే విషయంపై ‘నమస్తే తెలంగాణ’ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రైతు సోమతోనూ, వ్యవసాయ అధికారులతోనూ మాట్లాడితే వాస్తవాలన్నీ బయటకొచ్చాయి.
ఇదిగో పరిహారం!
జాటోత్ సోమ పేరు మీద 1.20 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 0.30 గుంటల్లో అతనికి సంబంధించిన వరి పంటకు నష్టం వాటిల్లింది. సోమ భార్య రామతార పేరు మీద 3.31 ఎకరాల భూమి ఉండగా, ఇందులో మిర్చి-30 గుంటలు, మక్కజొన్న 20 గుంటలు కలిపి మొత్తం 1.10 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. సోమ కుమారుడు శ్యామ్కుమార్ పేరు మీద 24 గుంటల పొలం ఉన్నది. ఇందులో వేసిన మొత్తం వరి పంట నష్టపోయినట్టు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నివేదిక ఆధారంగా జాటోతు సోమకు రూ.7,500, రామతారకు రూ.12,500, శ్యామ్కుమార్ రూ.6 వేల చొప్పున వారివారి బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు. మొత్తం ముగ్గురు పేరు మీద 2.24 ఎకరాల పంట నష్టానికి ప్రభుత్వం రూ.26 వేలు అందించిందని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఛత్రునాయక్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.