నిజాంపేట, మే 16 (నమస్తే తెలంగాణ): అప్పు చేసి సాగుచేసిన పంట కండ్లముందే ఎండిపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నిజాంపేటలో బుధవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గెరగంటి ఎల్లయ్య (45) తనకున్న మూడెకరాల భూమిలో యాసంగిలో వరి సాగుచేశాడు. సాగునీరు అందకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంట ఎండిపోయింది. సాగు కోసం చేసిన దాదాపు రూ. 4 లక్షల అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనోవేదనకు గురైన ఎల్లయ్య బుధవారం రాత్రి ఇంటిముందున్న వేపచెట్టుకు ఉరివేసుకున్నాడు. ఎల్లయ్య భార్య వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నిజాంపేట ఎస్సై శ్రీనివారెడ్డి తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా, పెద్దమ్మాయి డిగ్రీ చదువుతుండగా, చిన్న కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు.