బెజ్జంకి, ఏప్రిల్ 27: నీళ్లు లేక పంట పండక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సిద్దిపేట జిల్లాలో మరో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు కొరుకోప్పుల సత్తయ్య (50) 19 గుంటల్లో వరి పంట వేయగా నీళ్లులేక పంట ఎండిపోయింది. దీనికితోడు పాపయ్యపల్లిలో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలు తీసుకుని పత్తి వేయగా సరిపడా దిగుబడి రాలేదు.
వ్యవసాయ పనులకు ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇల్లు పూర్తిగా శిథిలావస్థ చేరుకోగా ఇంటి నిర్మాణం కోసం రుణం చేయగా సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు అయ్యాయి. వీటిని ఎలా తీర్చాలనే మనోవేదనకు గురైన సత్తయ్య శుక్రవారం మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగు మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వెళ్లి సత్తయ్యను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. సత్తయ్యకు భార్య శోభ, కుమారులు అనిల్, హరీశ్, విష్ణు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బెజ్జంకి ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.