పెద్దమందడి, జనవరి 24 : దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామానికి చెందిన ఖాజాపాషా (43)కు ఇద్దరు సోదరులు. మొత్తం కలిపి వీరి తల్లి పేరిట రెండెకరాల పొలం ఉన్నది. ఇందులోనే వారు పంటలు సాగుచేస్తూ కుటుంబ పోషణ కొనసాగించారు. ఎక్కువగా వరి సాగు చేసేటోళ్లు. నిరుడు వరి దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా వ్యవసాయంతోపాటు పాడిని ఎంచుకున్నారు. ఇందుకోసం రూ.6 లక్షలు వెచ్చించి ఐదు గేదెలను కొనుగోలు చేశాడు. ఇది కూడా లాభసాటిగా లేకపోవడంతో దిగాలు చెందేవాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం మధ్యాహ్నం తన పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య ఫాతిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.