సంగారెడ్డి, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కడు పేదరికంలో ఉన్న దళిత కుటుంబం వారిది. కూలీనాలీ చేసుకుంటేనే కూడు దొరికే పరిస్థితి. చిన్నప్పుడే పోలియో రావడంతో కుడికాలు సరిగ్గా నడవలేని దుస్థితి. వైకల్యం వెన్నాడినా.. వెన్ను చూపకుండా కాయకష్టం చేసి బతుకుసాగించాడు. గుంట భూమి లేకపోవడంతో కౌలు మీద ఆధారపడి సాగు మొదలుపెట్టిండు. కాలం కలిసి రాక దిగుబడి లేకపోవడంతో దిగులు చెందిండు. కౌలు రైతులను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తడంతో మరింత డీలా పడిండు. రోజురోజుకు పెరుగుతున్న అప్పులకు మిత్తీలు కట్టలేక.. పొలంలోనే చెట్టుకు ఉరేసుకున్నాడు. తననే నమ్ముకున్న భార్య, పిల్లలను అనాథలను చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి(బి) గ్రామానికి చెందిన దళిత రైతు న్యామతాబాద్ రమేశ్. పోలియో కారణంగా రమేశ్ కుడికాలు సరిగ్గా నడవలేని పరిస్థితి. పేదరికం కారణంగా రమేశ్ పెద్దగా చదువుకోలేదు. సాగు భూమి లేకపోవడంతో కుటుంబానికి అండగా ఉండాలని రైతు కూలీగా మారాడు. పెళ్లీడు వచ్చాక తల్లిదండ్రులు రేగోడ్కు చెందిన లక్ష్మితో వివాహం జరిపించారు. రమేశ్, లక్ష్మి కూలీ పనిచేస్తూ తమ ఇద్దరు కొడుకులను చదివిస్తున్నారు. పెద్ద కొడుకు రాఘవేంద్ర చేర్యాల్లోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా, చిన్న కొడుకు కార్తీక్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సంసారం బాగా సాగుతుండటంతో రమేశ్ మూడేండ్ల నుంచి కౌలుకు భూములు తీసుకుని సాగు చేయటం ప్రారంభించాడు.
కాలం కలిసిరాక …
కౌలురైతుగా మారిన రమేశ్కు కాలం కలిసిరాలేదు. గత ఏడాది గ్రామంలోని ఓ పెద్ద రైతు భూమి కౌలుకు తీసుకుని చెరుకు పంట వేశాడు. ఆశించిన పంట దిగుబడి రాక రమేశ్కు అప్పులు మిగిలాయి. ఇంటి నిర్మాణానికి మరో రూ.3 లక్షలు అప్పు చేశాడు. అప్పులు చెల్లించాలని ఇచ్చినవారు ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు సెలవులపై ఇంటికి వచ్చిన పెద్దకొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. అబ్బాయి చికిత్సకు ఇబ్బంది అవుతోంది. కౌలు రైతులకు రైతు భరోసా కింద ఆర్థిక సహాయం చేస్తామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అప్పులు తీర్చే మార్గం కనిపించక రమేశ్ మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఫిబ్రవరి 1న పొలానికి వెళ్లొస్తానని భార్య లక్ష్మికి వెళ్లిన రమేశ్ మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెళ్లి చూస్తే చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఇంటికి పెద్ద దిక్కు పోవడంతో భార్య లక్ష్మీ, పిల్లలు రాఘవేంద్ర, కార్తీక్, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
మాకు దిక్కెవరు ?
చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అనాథ అయిన నన్ను మేనమామ సాకి పెండ్లి చేశాడు. రమేశ్, పిల్లలు వచ్చాక నా జీవితంలో ఆనందం వచ్చింది. వాళ్లే లోకంగా బతికాను. నేను నమ్ముకున్న రమేశ్ నాకు దూరమైండు. పొలానికి నీళ్లు పెట్టి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఇస్తే నా భర్త బతికేవాడు. మాకు గుంట భూమిలేదు. రైతుబీమా రాదు. ఇగ మాకు దిక్కెవరు ? మా పరిస్థితి చూసి ప్రభుత్వం స్పందించాలి. మమ్మల్ని ఆదుకోవాలి. -న్యామతాబాద్ లక్ష్మి, రమేశ్ భార్య