ఐనవోలు, మార్చి 29: అప్పుల బాధతో ఓ కౌలు రైతు విషగుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఐనవోలు మండల కేంద్రానికి చెందిన చింత సారయ్య(47) తనకున్న ఎకరంన్నర భూమితోపాటు మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 2 ఎకరాల్లో వరి, ఎకరంలో మక్కజొన్న, ఎకరంలో కూరగాయలు సాగుచేశాడు. రెండు మూడేండ్ల నుంచి పంట పెట్టుబడికి సుమారు రూ.6 లక్షల అప్పులయ్యాయి. వాతావరణం అనుకూలించక.. పంట దిగుబడి సరిగా రాక.. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషగుళికలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్టు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు సామ్యూల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు.