కాటారం, ఫిబ్రవరి 26: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దంతాలపల్లికి చెందిన రైతు సింగిరెడ్డి శ్రీనివాస్ ఆత్మహత్య ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కాటారం ఎస్సై అభినవ్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్(48)కు భార్య రజిత, ఇద్దరు కుమారులు అజయ్, అక్షయ్ ఉన్నారు.
వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా, ఇద్దరు కుమారులు హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. శ్రీనివాస్ ఈ ఏడాది మూడెకరాల తన సొంత భూమితోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి పంట సాగు చేశాడు. రెండున్నర ఎకరాల్లో సుమారు రూ.4.50 లక్షల పెట్టుబడితో మిర్చి పంట, మరో మూడున్నర ఎకరాల్లో సుమారు రూ.2.50 లక్షల పెట్టుబడితో పత్తి సాగు చేశాడు.
తెగుళ్లు సోకి మిర్చి పంట నాశనమైంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో పత్తి పంట దిగుబడి రాలేదు. దీంతో సుమారు రూ.7 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు చిన్న కుమారుడు అక్షయ్ చదువు కోసం రూ.లక్షా 30 వేల ఫీజు చెల్లించాల్సి ఉన్నది. చేసిన అప్పు తీర్చలేనని తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో మహదేవపూర్కు తీసుకెళ్తుండగా దారిలోనే మృతిచెందాడు.