షాద్నగర్, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ నాయకుడి వేధింపులతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగెళ్లపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పెర్మాల్రెడ్డి వ్యవసాయ పొలంలో బోరుబావి విద్యుత్తు కనెక్షన్ కోసం నెల రోజుల కిత్రం డీడీ కట్టారు. అయితే.. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గోవర్ధన్ విద్యుత్తు కనెక్షన్ ఇవ్వకుండా అధికారులను అడ్డుకుంటూ పెర్మాల్రెడ్డిని మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన పెర్మాల్రెడ్డి ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి శంషాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. తమ కుటుంబాన్ని వేధిస్తున్న గోవర్ధన్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య అధికారులను వేడుకుంటున్నది. గ్రామంలో కొందరి రాజకీయ ఒత్తిళ్ల వల్ల పెర్మాల్రెడ్డి ఆత్మహత్యకు యత్నించాడని విద్యుత్తు అధికారులు చెప్పడం గమనార్హం. దవాఖానలో చికిత్స పొందుతున్న పెర్మాల్రెడ్డిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించి బాధితుడు త్వరగా కోలుకునేలా చొరవ చూపాలని వైద్యులకు సూచించారు.