హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వైద్యుడు, నిమ్స్ మాజీ డైరెక్టర్, పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు (96) కన్నుమూశారు. కొన్నాళ్లుగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నెలరోజులుగా కిమ్స్ దవాఖానలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ రోడ్డునంబర్-2లోని నివాసంలో ఆయన భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాకర్ల మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వైద్యరంగానికి కాకర్ల చేసిన సేవలను స్మరించుకున్నారు. నిమ్స్ డైరెక్టర్గా చేసిన కృషి గొప్పదని కొనియాడారు. కాకర్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్రావు, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, జయప్రకాశ్నారాయణ, కిమ్స్ దవాఖాన ఎండీ బొల్లినేని భాస్కర్రావు తదితరులు నివాళులర్పించా రు. కాకర్ల మృతి తీరనిలోటని ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ దవాఖాన చైర్మన్ నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు.
ఏపీలోని కృష్ణా జిల్లా పెద్దముత్తేవికి చెందిన కాకర్ల 1925లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌజ్ సర్జన్గా పనిచేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి 1955లో అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 1956 వరకు న్యూయార్క్, బాల్టిమోర్లోని దవాఖానల్లో పనిచేశారు. 1956లో స్వదేశానికి వచ్చి హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. 1970లో మళ్లీఅమెరికా వెళ్లారు. యునైటెడ్ కింగ్డవ్ు వారి ‘ఫెలో ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ రేడియాలజిస్ట్’ పట్టా పొందారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1986లో అమెరికా నుంచి తిరిగొచ్చి హైదరాబాద్లో నిమ్స్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు చేపట్టారు. 50 ఏండ్ల ఆయన వైద్య జీవితంలో అనేక పుస్తకాలు రాశారు. ఆయన పరిశోధన వ్యాసాలు అనేక జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితం అయ్యాయి. దేశ, విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. కాకర్ల వైద్య సేవలను గుర్తించిన కేంద్రం 2000లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.